
దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్పై మరోసారి చర్చ జోరందుకుంది. ఇథనాల్ను 20 శాతం వరకు కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరుపై ప్రభావం పడుతోందంటూ పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ భయాలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది. తాజాగా కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివరణ ఇచ్చారు.
బీఎస్-3 పెట్రోల్ వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు వంటి చిన్నపాటి విడిభాగాలను మార్చాల్సిన అవసరం రావచ్చని గడ్కరీ తెలిపారు. అయితే దీనివల్ల ఇంజిన్ పనితీరు, మన్నిక లేదా మైలేజీపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం-డెహ్రాడూన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో కూడా ఇంజిన్లో పెద్ద మార్పులు అవసరం లేదని తేలిన తర్వాతే దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ20 అమలు చేశామని తెలిపారు.
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వాహనదారుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం, 2023కి ముందు తయారైన పెట్రోల్ కార్ల యజమానుల్లో 66 శాతం మంది తమ వాహనాల మైలేజీ 10 శాతం వరకు తగ్గిందని పేర్కొన్నారు. అలాగే 55 శాతం మంది వాహనాలకు గతంతో పోలిస్తే మరమ్మతులు ఎక్కువగా అవసరమవుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా 2023కు ముందు తయారైన వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా రూపకల్పన కాలేదనే అంశం వినియోగదారుల్లో సందేహాలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇంధన దిగుమతులు తగ్గడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నప్పటికీ, మైలేజీ తగ్గుదలతో పాటు పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోమొబైల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా తమ వాహనం ఆర్సీ బుక్ లేదా ఫ్యూయల్ క్యాప్పై “E20 Compatible” అని ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు. మారుతి, హ్యుందాయ్, టయోటా సంస్థల ఏప్రిల్-2023 తర్వాత తయారైన మోడళ్లు, టాటా సంస్థ ఫిబ్రవరి-2023 తర్వాత తయారైన వాహనాలు ఈ20 ఇంధనానికి అనుకూలంగా రూపొందించాయి. పాత మోడళ్ల యజమానులు మాత్రం ఫ్యూయల్ సిస్టమ్ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం, వాహనంలో మైలేజీ లేదా పనితీరులో మార్పులు కనిపిస్తే వెంటనే సర్వీస్ సెంటర్ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..