ఎర్రకోట మైదానంలో జరిగే రామ్లీలా వేడుకలు రద్దు
పాపిష్టి కరోనా ఎప్పుడు పోతుందో ఏమో కానీ.. ఓ ఉత్సవం, ఓ ఉత్సాహం, ఓ సంబరం లేకుండా చేస్తోంది.. మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలపై కూడా ప్రభావం చూపుతోంది..
పాపిష్టి కరోనా ఎప్పుడు పోతుందో ఏమో కానీ.. ఓ ఉత్సవం, ఓ ఉత్సాహం, ఓ సంబరం లేకుండా చేస్తోంది.. మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలపై కూడా ప్రభావం చూపుతోంది.. చివరకు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొనే రామ్లీలా వేడుకలను కూడా జరుపుకోనివ్వకుండా చేసింది.. కరోనా కారణంగా ఈసారి రామ్లీలా వేడుకలను నిర్వహించడం లేదని లవ్కుశ్ రామ్లీలా కమిటీ స్పష్టం చేసింది.. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇంకా లభించలేదని చెప్పింది.. ఎర్రకోట మైదానంలో జరిగే రామ్లీలా వేడుకలు ఎంతో ప్రసిద్ధి.. 80 ఏళ్లుగా నిరాటంకంగా వేడుకలు జరుగుతూ వచ్చాయి.. ఈసారి మాత్రం కరోనా ఆ ఆనందం లేకుండా చేసింది.. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ రామ్లీలా, దుర్గా పూజ ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎర్రకోటలో రామ్లీలా వేడుకల నిర్వహణపై ఆర్కియాలాజకల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కావలసి ఉంది.. రామ్లీలా సంబరాలను నిర్వహించాలని తాము మొదట అనుకున్నామని, ఎర్రకోట మైదానం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారి అనుమతి కోసం ఇప్పటి వరకు ఎదురుచూశామని కమిటీ చెప్పింది.. ఏఎస్ఐ నుంచి ఇప్పటి వరకు అనుమతి దొరకలేదని, వేడుకల నిర్వహణకు ఇంకా సమయం ఉన్నా ఢిల్లీ ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం వేడుకలను జరపడం సాధ్యం కాదని కమిటీ వివరించింది. ప్రభుత్వం కూడా దీనిపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. విజయదశమి రోజున దేశంలో చాలా చోట్ల రామ్లీలా వేడుకలు జరుగుతాయి కానీ ఢిల్లీలో జరిగే రామ్లీలా వేడుకలే ప్రత్యేకం.. ఇవే పెద్దవి కూడా! దేశంలోని వివిధ ప్రాంతాల సుమారు 600 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు.. ఈసారి సినీ, టీవీ కళాకారులు కూడా ఇందులో పాల్గొనాలని అనుకున్నారు..