
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 200 IEDలతో ఢిల్లీలో బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయాల దగ్గర పేలుడు జరిపేందుకు పన్నాగం పన్నారు. అయోధ్య రామమందిరంతో పాటు వారణాసిలో కూడా ఉగ్రవాదులు పేలుడుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. జనవరి 26న పేలుళ్లకు కుట్ర చేశారు. ఉగ్రవాది షహీన్ స్లీపర్ సెల్లో యాక్టివ్ మెంబర్గా గుర్తించారు.
ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీశారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. జనవరి నుంచి ఈ కుట్రకు పథకరచన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్కు పాక్ సంస్థ జేషేకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పేలుళ్ల కోసం రెండేళ్లుగా పేలుడు పదార్థాలను నిల్వచేశాయి ఉగ్రమూకలు ఇప్పటికే ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోగా మరో 300 కేజీల పేలుడు పదార్ధాల కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది NIA . ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. రెడ్ కలర్ ఎకో స్పోర్ట్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు పోలీసు బృందాలు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఎర్రకోట దగ్గర పేలుడుకు వాడిన i20 కారుతో పాటు ఉగ్రవాదుల దగ్గర ఎకో స్పోర్ట్స్ కారు ఉన్నట్టు గుర్తించారు. ఆ కారు ఎక్కడ ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు వెతుకుతున్న కారు నెంబర్ DL10CK0458 . ఢిల్లీ, హర్యానా, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కారు కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటననలో.. ఇప్పటివరకు 18 మంది అరెస్ట్ అయ్యారు. డాక్టర్ ఉమర్ కుటుంబంతోపాటు.. అరెస్టయిన వారి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్తో పాటు దేశం లోని పలు ప్రాంతాల్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. 200 చోట్ల కశ్మీర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు సహకరించిన వాళ్ల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..