దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ బాధితులు గ్రాఫ్ పైపైకి పాకుతోంది. దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. అలాగే కరోనా రోగుల సంఖ్య 90 వేల నుండి లక్షకు కేవలం రెండు రోజుల్లో చేరుకుంది. దీంతో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తి తగ్గటం లేదు. దీంతో కోర్టులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. దేశ రాజధానిలోని ఓ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పరిధిలో స్టాంపులను అంటించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. స్టాంపులకు అంటించటానికి నోటిలోని లాలాజలం, ఉమ్మిని వాడటాన్ని నిషేధించింది ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం. న్యాయస్థానానికి పెట్టుకునే దరఖాస్తులు, విజ్ఞాపనలపై అంటించే స్టాంపులకు ఉమ్మిని ఉపయోగించరాదని హెచ్చరించింది. కోర్టు పరిసరాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులందరికీ వర్తిస్తుందని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉమ్మికి బదులుగా ప్లాస్టిక్ స్పాంజి ఉండే గమ్ ప్యాడ్ను వినియోగించాలని ఉత్తర్వులో న్యాయ మూర్తి ఆదేశించారు.