
ఢిల్లీలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పాస్ అవుతారని నమ్మకం ఉన్న విద్యార్థులనే ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ సర్కార్ విద్యావ్యవస్థలో అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు ప్రధాని.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీపై బాంబ్ పేల్చారు. ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. ఇక్కడి పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతించడం లేదని చెప్పారు. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతులకు పంపిస్తున్నారని తెలిసిందన్నారు. రిజల్ట్ సరిగా రాకపోతే.. ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను పైచదువులు చదవకుండా విద్యా వ్యవస్థలోనూ ఆప్ అవినీతికి పాల్పడుతుందన్నారు. ఆప్ ప్రతిష్ఠను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.
ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి, 11 వ తరగతిలో ఫెయిలయ్యే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో ఏటా లక్ష మందికి పైగా ఫెయిల్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ విద్యావ్యవస్థపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..