Cyclone Yaas: ఆంధ్రప్రదేశ్‌కు ఓ న్యాయం..బెంగాల్‌కు మరో న్యాయమా? విరుచుకపడ్డ మమతా బెనర్జీ

|

May 24, 2021 | 9:22 PM

Cyclone Yaas News: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని కొనసాగిస్తున్నారు. యాస్ తుఫాను ముందస్తు సాయం విషయంలో పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

Cyclone Yaas: ఆంధ్రప్రదేశ్‌కు ఓ న్యాయం..బెంగాల్‌కు మరో న్యాయమా? విరుచుకపడ్డ మమతా బెనర్జీ
Mamata Banerjee
Follow us on

Yaas Cyclone Updates – Mamata Banarjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని కొనసాగిస్తున్నారు. యాస్ తుఫాను ముందస్తు సాయం విషయంలో పశ్చిమ బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. యాస్ తుఫానును ఎదుర్కొనే విషయంలో పశ్చిమ బెంగాల్‌‌కు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెబుతున్న కేంద్రం…ముందస్తు సాయం కేటాయింపుల విషయంలో మాత్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. యాస్ తుఫాను ముందస్తు సాయం కింద పశ్చిమ బెంగాల్‌కు రూ.400 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం…చిన్న రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు తలా రూ.600 కోట్లు కేటాయించిందన్నారు. ఇది ముమ్మాటికీ బెంగాల్ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న శీతకన్నుకు తార్కాణమని ఆరోపించారు. యాస్ తుఫాను సన్నద్ధతపై హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భౌగోళికంగానూ…జనాభా పరంగానూ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కంటే పశ్చిమ బెంగాల్ ఎంతో పెద్ద రాష్ట్రమని మమతా బెనర్జీ గుర్తుచేశారు. మరి వాటి కంటే పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు తక్కువ నిధులు కేటాయించిందో చెప్పాలని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ పట్ల తరచూ కేంద్రం వివక్షను చూపుతోందని ధ్వజమెత్తారు. ఒడిశా, ఏపీలకు ఎక్కువ నిధులు వచ్చినందుకు తనకు ఇబ్బంది లేదని, అయితే ప.బెంగాల్‌కు ఎందుకు తక్కువ సాయాన్ని కేటాయించడం అభ్యంతరకరమన్నారు. పుదిచ్చేరిని ఉత్తరప్రదేశ్‌తో పోల్చగలరా? అని ప్రశ్నించారు. నిధుల కేటాయింపులు జనాభా సంఖ్య, భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

కరోనా కట్టడిపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ…తమకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదంటూ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు మరోసారి మమతా బెనర్జీ కేంద్రాన్ని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు.. స‌ర్పంచ్‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు

ఏపీలోని నిరుద్యోగుకుల ముఖ్య గమనిక.. భారీగా వాలంటీర్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ..