
దేశంలోని పలు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాడులు చేస్తూ తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు కుక్కకాటుకు బలై చనిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో కూడా ఓ ఘటన జరిగింది. అయితే తుగ్లక్ లేన్ లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధి కుక్కల గుంపు దాడి చేసి కరవడంతో ఏడాదిన్నర బాలిక తండ్రి రూ.50 లక్షల పరిహారం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ మార్చి 4న జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ముందు విచారణకు రానుంది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు త్వరితగతిన అమలయ్యేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ)లను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్డీఎంసీ నిర్లక్ష్యం, పరిపాలనా లోపం కారణంగా తన ఏడాదిన్నర కుమార్తెపై కుక్కలు కిరాతకంగా దాడి చేసి, నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లి, చంపాయని పిటిషనర్ రాహుల్ కనౌజియా తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎన్డీఎంసీ ఇలాంటి నిర్లక్ష్య, పాలనాపరమైన తప్పిదం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలి అనే వాదనలు వినిపించాయి. ఈ ఘటన ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం చోటుచేసుకుంది. చిన్నారి ఇంటి బయట కూర్చొని ఉండగా నాలుగైదు కుక్కలు చిన్నారిపై దాడి చేసి కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలోని ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో కుక్క కాటు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.