Kamal Nath: ప్రశాంత్ కిశోర్ భేటీతో కాంగ్రెస్‌లో మార్పులు.. సోనియా నివాసంలో కీలక మంతనాలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్?

రాజకీ విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం అనుహ్యంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పుడే ఏఐసీసీలో కదలిక మొదలైంది.

Kamal Nath: ప్రశాంత్ కిశోర్ భేటీతో కాంగ్రెస్‌లో మార్పులు.. సోనియా నివాసంలో కీలక మంతనాలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్?
Kamal Nath Meet Sonia Gandhi

Updated on: Jul 15, 2021 | 5:04 PM

Changes in Congress leadership: రాజకీ విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం అనుహ్యంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పుడే ఏఐసీసీలో కదలిక మొదలైంది. సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీల్లోని ఆమె నివాసంలో గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.

ముఖ్యంగా రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితమే పార్టీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సూచించడంతో.. ఇందుకు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సమర్థుడని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణం.

బీజేపీయేతర పార్టీలను కూడగట్టగలరన్న నమ్మకంతో కమల్‌నాథ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. అంతేకాదు కరోనా విజృంభణ సమయంలో ప్రజల కష్టాలను పార్లమెంట్ సాక్షిగా నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సందర్భంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్‌ను నియమిస్తారని, సోనియాగాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం అధ్యక్షులు లేకపోవడంతో కమల్ నాథ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ వచ్చేవరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఆయనను అధ్యక్షులుగా నియమిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసునే అవకాశం ఉందని తెలిస్తోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రస్తుతం ఫ్లోర్ లీడర్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌదరిని అదే బాధ్యతల్లో కొనసాగనున్నారు. అయితే, రాహుల్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పజెప్పాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ సూచించడం, పలువురు సీనియర్ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో మార్పు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం ఆ విషయం లో ఎలాంటి మార్పు చేయకుండా పార్టీ నాయకత్వం విషయంలో మాత్రమే కమల్ నాథ్ లాంటివారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

Read Also…  100 మంది రైతులపై ‘దేశద్రోహం’ కేసులు పెట్టిన హర్యానా పోలీసులు.. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యల మాటో ?

Loading...
Unable to load recommendations.
Follow Us