
న్యూఢిల్లీ, జులై 14: దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ‘సమగ్ర లైంగిక విద్య’ (Comprehensive Body Education) ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందని, కోర్టు అనుమతి లభించిన వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ విషయాన్ని వెల్లడించారు. కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం అంగీకరించిందని, దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
యువత మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడే సంబంధాలు, మైనర్ గర్భధారణలకు సంబంధించిన కేసులు పోక్సో (POCSO) చట్టం కింద క్రిమినల్ కేసులుగా మారకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అదనపు కార్యదర్శి నేతృత్వంలో 26 మంది సభ్యులతో కూడిన జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు కలిగే కౌమారదశ యువత గోప్యతా హక్కులు, పోక్సో చట్టం ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేసే బాధ్యత అప్పగించారు.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS), క్లినికల్ సైకాలజిస్టులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NLSA) ప్రతినిధులు సభ్యులుగా ఉన్న కమిటీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన పలు కీలక అంశాలు సూచించింది.
ఈ అంశాలను ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలని కమిటీ సూచించింది. ఈ అంశాలపై తగిన పాఠ్య ప్రణాళికను రూపొందించాలని NCERTకి కమిటీ సూచించింది. అలాగే జాతీయ విద్యా విధానం-2020 (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల్లో కౌమారదశ విద్యను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని కమిటీ సిఫార్సు చేసింది. వారానికి కనీసం రెండు సార్లు తప్పనిసరిగా సమగ్ర లైంగిక విద్యపై తరగతులు నిర్వహించాలి. ప్రతి తరగతి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి. అలాగే పిల్లల ఎదుగుదల దశలు, లైంగిక విద్య ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కమిటీ నివేదికను సీనియర్ న్యాయవాదులు మాధవి దివాన్, లిజ్ మాథ్యూ స్వాగతించారు. అయితే ‘సమగ్ర లైంగిక విద్య’ అనే అంశాన్ని మరింత స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.