
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వీరి ఆరోగ్య భద్రత కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన వైద్యం పొందేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరే పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. సంక్రాంతి కానుకగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం పరిధిలోని ఉద్యోగులు ఈ కొత్త పథకంతో లబ్ది పొందవచ్చు. కుటుంబంలో ఆరుగురి వరకు ఇది వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబసభ్యులు దేశంలోని ఈ పథకంలో లిస్ట్ అయిన కార్పొరేట్ నెట్వర్క్ హాస్పిటళ్లలో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం పొందవచ్చు. వైద్య ఖర్చులు పెరుగుతుండటం, అత్యాధునిక సర్జరీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్నీ ఖర్చులను ఈ పథకం భరిస్తుంది. ఇక అద్దె లిమిట్ వచ్చి జనరల్ వార్డులో చేరితే బీమా సొమ్ములో ఒక శాతం, ఐసీయూకు 2 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఇక చికిత్స చేయించుకోవడానికి ఒక నెల ముందు, చికిత్స పూర్తైన తర్వాత రెండు నెలలకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది.
ఇక ఈ పథకంలో కో పేమెంట్ ఆప్షన్ ఉంది. వైద్య ఖర్చులో 70 శాతం కేంద్రం భరిస్తే.. 30 శాతం పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఈ పథకం ద్వారా బీమా రక్షణ పొందవచ్చు. పూర్తిగా క్యాష్ లెస్ విధానం అమలు చేయడం వల్ల ముందుగా పాలసీదారుడు డబ్బు చెల్లించి ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. క్యాష్ లెస్ విధానం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు. కేంద్రమే ఆస్పత్రులకు నేరుగా డబ్బులు చెల్లిస్తుంది.