
మహారాష్ట్ర నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దోపిడి కలకలం రేగింది. రద్దీగా ఉండే హిరావాడి ప్రాంతంలోని న్యూ సమృద్ధి జ్యువెలర్స్ లక్ష్యంగా ఆరుగురు దొంగలు చోరికి యత్నించారు. రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసేందుకు యజమాని నయన పగారియా, సిబ్బంది అమిత్ శ్రీమాలి, మరో మహిళా ఉద్యోగి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మూడు బైకులపై ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు మెరుపు వేగంతో లోపలికి దూసుకొచ్చారు. రాగానే పిస్టళ్లు తీసి అందరినీ చంపేస్తామంటూ బెదిరించారు.
దొంగలు బెదిరిస్తున్నా నయన పగారియా అస్సలు భయపడలేదు. దొంగలు నగలు ఎత్తుకెళ్తుంటే వారిని అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించింది. కౌంటర్ పై ఉన్న వస్తువులను వారిపైకి విసిరింది. ఒకానొక దశలో కౌంటర్ మీదకు ఎక్కి మరీ దొంగలను కిందకు తోస్తూ, వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చూపించిన ధైర్యానికి ఆయుధాలు పట్టుకున్న దొంగలు సైతం ఒక్కక్షణం బిత్తరపోయారు. ఈ క్రమంలో నిందితులు గాలిలోకి కాల్పులు జరిపారు. సిబ్బంది సభ్యుడు అమిత్ శ్రీమాలి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించగా, దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అమిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నారు. అయినా సరే నయన పగారియా తన ప్రతిఘటన ఆపలేదు. తన అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో దొంగలు కంగారు పడి కొన్నింటిని అక్కడే వదిలేసి పారిపోయారు.
ఈ దోపిడీ యత్నానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి పోరాడిన నయన పగారియా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు రాత్రికి రాత్రే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.