
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో గురువారం సినీ నటి స్వర భాస్కర్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీతో కలిసి మాట్లాడుతూ కొంతదూరం నడిచారు.

రాహుల్ గాంధీతో స్వరా భాస్కర్ కలిసి చాలా సేపు కనిపించారు. వివాదాలకు దగ్గరగా ఉండే స్వరా ఇప్పుడు భారత్ జోడో యాత్రలో చేరడం ద్వారా కాంగ్రెస్కు మద్దతు తెలిపింది.

అంతకుముందు రోజు(బుధవారం) ఇండోర్ విమానాశ్రయంలో స్వర భాస్కర్కు కాంగ్రెస్ నేత సత్యనారాయణ పటేల్ స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సత్యనారాయణ పటేల్ తన పోస్ట్లో ‘‘దేశ ఐక్యత, సమానత్వం, గౌరవం కోసం పోరాడటానికి సిద్ధమైన రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికి ప్రముఖ నటి స్వరా భాస్కర్ జీ ఈ రోజు ఇండోర్ చేరుకున్నారు. రేపు ఉదయం జెండా ఎగురవేయడంతో పాటు, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు’’ అని కాప్షన్ రాశారు.

ఒకరోజు విరామం తర్వాత భారత్ జోడో యాత్ర గురువారం ఉదయం ఉజ్జయిని నుంచి ప్రారంభమై మధ్యప్రదేశ్ చివరి జిల్లా అగర్ మాల్వా వైపు సాగింది.

గురువారం యాత్రలో స్వర భాస్కర్తో పాటు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రేమ్చంద్ గుడ్డు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శోభా ఓజా కూడా పాల్గొన్నారు.

ఉజ్జయిని శివార్లలో ఉన్న ఆర్డీ గార్డి మెడికల్ కాలేజీ నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం ఘటియా బస్టాండ్ నుంచి యాత్ర ప్రారంభమై రాత్రికి ఝల్రా గ్రామంలో ఆగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

స్వర భాస్కర్ కంటే ముందు, పూజా భట్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్ ఇంకా అమోల్ పాలేకర్ వంటి చాలా మంది తారలు.. కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన ఈ జోడో యాత్రలో పాల్గొన్నారు.