ఆగస్టు 17న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు.. 12 డిమాండ్లతో కేంద్రానికి బీఎంఎస్ వినతి

కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 17న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా, ప్రదర్శన నిర్వహించనుంది.

ఆగస్టు 17న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు.. 12 డిమాండ్లతో కేంద్రానికి బీఎంఎస్ వినతి
Bharatiya Mazdoor Sangh

Updated on: Aug 14, 2026 | 7:32 PM

కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 17, 2026న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) కేంద్ర కార్యనిర్వాహక కమిటీ (KKS) పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్ర యూనిట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు భారీ ధర్నా, ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీఎంఎస్ తెలిపింది. వివిధ రంగాలకు చెందిన బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొంది.

జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు

2026 జూలైలో రాంచీలో జరిగిన బీఎంఎస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో దేశంలోని 28 రాష్ట్ర యూనిట్లు, 42 పారిశ్రామిక ఫెడరేషన్లకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు బీఎంఎస్ వెల్లడించింది. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించి.. కార్మికుల సమస్యలపై ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, కార్మిక శాఖ మంత్రులకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

బీఎంఎస్ ప్రధాన డిమాండ్లు ఇవే..

బీఎంఎస్ తన నిరసన కార్యక్రమంలో మొత్తం 12 ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది.

EPS-95 కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,500కు పెంచాలి. దానికి వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ను అనుసంధానించడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకురావాలి.

ESI వేతన పరిమితిని రూ.21,000 నుంచి రూ.42,000కు పెంచాలి.

EPF వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000కు పెంచాలి.

కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా పూర్తి వేతనంపై బోనస్ అమలు చేయడంతో పాటు బోనస్ లెక్కింపు పరిమితిని రూ.7,000కు మించి పెంచాలి.

గ్రాట్యుటీని 15 రోజుల వేతనం నుంచి 30 రోజుల వేతనానికి పెంచి, ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా అమలు చేయాలి.

శాస్త్రీయ విధానంతో పాటు ద్రవ్యోల్బణానికి అనుసంధానమైన కనీస వేతన సూత్రాన్ని అమలు చేయాలి.

అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్‌హెచ్‌ఎం తదితర పథకాల కింద పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల గౌరవ వేతనాలను పెంచాలి.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.

కార్మికుల వేతనాలను దుర్వినియోగం చేసే కాంట్రాక్టర్లు, మానవ వనరుల ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి.

ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి.

భారత కార్మిక సదస్సు (Indian Labour Conference)ను వెంటనే నిర్వహించి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.

కార్మిక చట్టాల్లోని కొన్ని నిబంధనలపై వ్యతిరేకత

కొత్త కార్మిక చట్టాల్లోని కొన్ని నిబంధనలపై బీఎంఎస్ తన అభ్యంతరాలను మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (IR Code), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (OSH&WC Code)లోని కొన్ని అంశాలు కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణను బలహీనపరుస్తాయని బీఎంఎస్ అభిప్రాయపడింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో అధికారికంగా చర్చలు జరిపి, కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సవరణలు చేయాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది.

‘స్కీమ్ వర్కర్’ విధానాన్ని పునఃపరిశీలించాలి

అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఎన్‌హెచ్‌ఎం తదితర పథకాల్లో పనిచేస్తున్న వారిని ‘స్కీమ్ వర్కర్లు’గా మాత్రమే పరిగణించే విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలించాలని బీఎంఎస్ కోరింది. 1975 అక్టోబర్‌లో ప్రారంభమైన అంగన్‌వాడీ కార్యక్రమం దాదాపు అర్ధ శతాబ్దంగా కొనసాగుతున్నప్పటికీ, అందులో పనిచేస్తున్న వారు చాలా సందర్భాల్లో రోజుకు 10 నుంచి 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నారని బీఎంఎస్ పేర్కొంది. అయినప్పటికీ వారికి రెగ్యులర్ ఉద్యోగుల హోదా లేకపోవడంతో పాటు కార్మిక చట్టాలు, సామాజిక భద్రతా వ్యవస్థల నుంచి తగిన రక్షణ లభించడం లేదని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా స్కీమ్ వర్కర్ల భవిష్యత్తుపై కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, భారతదేశ పరిస్థితులు, మారుతున్న పని విధానాలకు అనుగుణంగా కొత్త జాతీయ విధానాన్ని రూపొందించాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది.

భారీగా తరలిరావాలని పిలుపు

కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు, బ్యాంకు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు సహా అన్ని వర్గాల వారు ఆగస్టు 17న జరిగే దేశవ్యాప్త నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది. కార్మికుల గౌరవం, సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామని బీఎంఎస్ స్పష్టం చేసింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us