
చట్టాన్ని అమలు చేయాల్సిన వారే నేరాలకు పాల్పడితే ప్రజలు ఎవరిని నమ్మాలి? బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రక్ డ్రైవర్ను హనీట్రాప్ చేసి, అతని నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతో ఓ ట్రైనీ సబ్ఇన్స్పెక్టర్ సహా పలువురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కలకలం రేపుతోంది.
జూన్ 14వ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్కు చెందిన ట్రక్ డ్రైవర్ సురేంద్ర యాదవ్ కతిహార్ నుంచి తన వాహనంలో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి-31పై రంగ్రా పోలీస్ స్టేషన్కు చెందిన పెట్రోలింగ్ బృందం అతని ట్రక్కును ఆపింది. ఒక బైకర్ను ఢీకొట్టిన కేసులో ఇరికిస్తామని బెదిరించినట్లు డ్రైవర్ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా, పోలీసులు ఓ యువతిని అక్కడికి తీసుకువచ్చి డ్రైవర్తో కలిసి ఫోటోలు దిగేలా బలవంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అతడిని బట్టలు విప్పాలని ఒత్తిడి చేసి, అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారని బాధితుడు తెలిపాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న డ్రైవర్ అంత మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో, చాలాసేపు బతిమాలిన తర్వాత రూ.18 వేల వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లు వెల్లడించాడు. ఈ మొత్తం ఒక పెట్రోల్ బంక్కు సంబంధించిన డిజిటల్ లావాదేవీ ద్వారా బదిలీ అయినట్లు సమాచారం. అయినప్పటికీ బెదిరింపులు కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేంద్ర యాదవ్ తన యజమాని కృష్ణ మోహన్ యాదవ్కు విషయం వివరించాడు. అనంతరం డయల్-112కు ఫిర్యాదు చేయడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.
ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన భాగల్పూర్ ఎస్పీ వైభవ్ శర్మ వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. నవగాచియా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్యామనందన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో కాల్ డేటా రికార్డులు, లావాదేవీల వివరాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించారు. దర్యాప్తులో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ట్రైనీ సబ్ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర కుమార్ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఘటన సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు హోంగార్డ్ సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, దోషులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..