
ఈ రోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ను రీలాంచ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో మర్రిచెట్టును నాటారు ప్రధాని మోదీ. దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాలను చేపట్టింది.
అరావళీ పర్వత శ్రేణులు విస్తరించిన హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో చెట్లు పెంచి అడవులను పెంచి పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో కేంద్రం ఈ గ్రీన్ బెల్ట్ కార్యక్రమం కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రీ లాంచింగ్ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల సీఎంలు పంచుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రధాని మోదీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ దాద్రిలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా, గుజరాత్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేడాలో, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ రామ్గర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అరావళి పర్వత శ్రేణుల వెంబడి 700 కిలో మీటర్ల పరిధిలో కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత క్షీణిస్తున్న నేపథ్యంలో అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్కు తిరిగి ఊపిరిలూదుతోంది కేంద్రం. ఆఫ్రికాలోని పశ్చిమ సెనెగల్ నుంచి తూర్పు జిబౌటి వరకు అమలుచేస్తున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్ట్ ప్రేరణపొందిన భారత్ అరావళీ గ్రీన్వాల్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి