విమాన చార్జీలకు రెక్కలు.. మోత మోగిపోతోన్న డొమెస్టిక్‌ చార్జీలు.. ఒక్కరోజు ముందైతే..

విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. డొమెస్టిక్‌ విమాన చార్జీలు మోత మోగిపోతున్నాయ్‌. దీంతో జనం పర్యటనలు రూట్‌ మార్చుకున్నాయి. దేశీయ పర్యటనలు కాకుండా విదేశీ పర్యటనలు బెటరనుకుంటున్నారు జనం.

విమాన చార్జీలకు రెక్కలు.. మోత మోగిపోతోన్న డొమెస్టిక్‌ చార్జీలు.. ఒక్కరోజు ముందైతే..
Domestic Flight Charges

Updated on: Jun 08, 2023 | 9:44 PM

విమాన చార్జీలతో హడలిపోతున్నారు జనం. తక్కువ సమయంలో ఎక్కవ ఉపయోగకరంగా మారాయి విమాన ప్రయాణాలు దీంతో… ఇటీవలి కాలంలో మధ్యతరగతి వర్గం విమాన ప్రయాణాలవైపు మొగ్గుచూపుతోంది. ఆ సంబరం ఎంతో సేపు నిలవలేదు. ఇప్పుడు విమాన ధరలు చుక్కలనంటుతున్నాయి. గగనతలంలోకి ఎగరాలంటే వేలుకుమ్మరించక తప్పని పరిస్థితి ప్రయాణికులను హడలెత్తిస్తోంది.  మొదట్లో ఫరవాలేదనిపించిన విమాన చార్జీలు…చూస్తుండగానే చుక్కలనంటేస్తున్నాయి. ఇక కోవిడ్‌ తరువాత చెప్పే పనే లేదు. ఫ్లైట్‌ ధరలను అమాంతం పెంచేశాయి దేశీయ విమానయాన సంస్థలు. ముందస్తు బుకింగ్‌ కాకుండా…ఒక్కరోజో, రెండ్రోజుల ముందో టికెట్‌ బుక్‌ చేస్తే మూడింతలు పెరిగిపోవడం ఖాయం. డైనమిక్‌ ప్రైసింగ్‌ తర్వాత ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారంగా రూట్ల ధరలు పెంచుతున్నాయి విమానయాన సంస్థలు. ఆఖరి నిముషంలో రేట్లు పెరుగుతుండడంతో వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు.

  • హైదరాబాద్‌ టు ఢిల్లీ చార్జీ 10,000 పైమాటే
  • సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌కి 6 నుంచి7 వేలు

దేశీయ విమాన టిక్కెట్ల ధరల కంటే…విదేశీ విమాన చార్జీలు చవకవడంతో జనం రూటు మార్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

  • కోవిడ్‌ తరువాత విహార యాత్రలకి పెరిగిన గిరాకీ
  • గత ఏడాదికన్నా 40 శాతం పెరిగిన విదేశీ విహారయాత్రలు
  • ఈ వేసవిలో సింగపూర్‌ వెళ్ళిన అత్యధిక మంది ఇండియన్స్‌
  • సింగపూర్‌ తరువాత శాన్‌ ఫ్రాన్సిస్కో, మెల్‌బోర్న్‌
  • టొరంటో…బాలికి సైతం భారీగా విమాన బుకింగ్‌లు

జెట్‌ ఎయిర్‌వేస్‌ గో ఫస్ట్‌ లాంటి విమాన సంస్థలు మూత పడడం… స్పైస్‌ జెట్‌ ఫ్లైట్‌లలో కొన్ని ఫ్లైట్లను గ్రౌండ్‌ చెయ్యడంతో మిగిలిన విమాన సంస్థలు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. మరోవైపు క్రూడ్‌ ధరలు తగ్గుతున్నా చార్జీలు మాత్రం తగ్గని పరిస్థితి దేశీయ ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది. గంటకు నిర్ణీత ధర అంటూ ప్రభుత్వం ఒక టారిఫ్ ను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా విమానయాన సంస్థలను కాపాడి ప్రయాణికులకు లాభం చేకూర్చవచ్చని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు.

కుటుంబ అసవరాల రీత్యా ప్రయాణించేవారు సైతం US, సింగపూర్‌, UAE, కెనడా, థాయ్‌లాండ్‌ లకు భారత దేశం నుంచి అత్యధిక మంది ప్రయాణించినట్టు ఓ నివేదక పేర్కొంది. ఇక సింగిల్‌గా వెళ్ళేవారిలో ఎక్కువ మంది US, కెనడా, UK లకు వెళ్ళారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..