Aditya L1: సూర్యుడిపై సెల్ఫీ.. అద్భుతమైన చిత్రాలు తీసిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌..

|

Sep 07, 2023 | 3:16 PM

ఆదిత్య ఎల్‌ -1 మొత్తం ఏడు పరిశోధనా పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలతో పాటు వెలుపల ఉండే కరోనానూ కూడా అధ్యయనం చేస్తాయి. సౌరజ్వాలలు, సౌర రేణువులు, సూర్యుడి సమీపంలో ఉండే వాతావరణం వంటి ఎన్నో అంశాలను ఆదిత్య మిషన్‌ శోధించనుంది. భారతదేశం తన మొదటి సన్ మిషన్ ఆదిత్య L1ని సెప్టెంబర్ 2న ప్రారంభించిన సంగతి తెలసిందే.

Aditya L1: సూర్యుడిపై సెల్ఫీ.. అద్భుతమైన చిత్రాలు తీసిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌..
Aditya L1 Takes A Selfie
Follow us on

సూర్యుడిని పరిశోధించేందుకు భారత్‌ పంపించిన ఆదిత్య L1 ఉపగ్రహం లక్ష్య్ం దిశగా విజయవంతంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆకాశం నుంచి ఫొటోలు, సెల్ఫీ పంపించింది ఈ ఉపగ్రహం. ఆకాశం నుంచి తీసిన ఒక ఫొటోలో మన భూగ్రహంతో పాటు తొంగి చూస్తున్నట్టు చందమామ కూడా కనిపించాడు. ఆదిత్య L1 ఆప్‌డేట్స్‌లో భాగంగా ఆ ఫొటోను ఇస్రో షేర్ చేసింది. ఈ సెల్ఫీ ఫొటోలను సెప్టెంబర్‌ 4న ఆదిత్య ఎల్‌-1 లోని కెమెరా క్యాప్చర్‌ చేసింది. ఈ ఫొటోలో ఆదిత్య ఎల్‌ 1లో ఉన్న విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ VELC, సోలా ఆల్ట్రా వయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ -SUIT పే-లోడ్స్‌ స్పష్టంగా కనిపించాయి. భూమి, చంద్రుడు ఒకేసారి కనిపించిన దృశ్యాలను కూడా ఆదిత్య ఉపగ్రహంలోని కెమెరా క్లిక్‌మనిపించింది.

సూర్యుడిని పరిశోధించేందుకు ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ సెప్టెంబర్‌ రెండున ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి సమీపంలోని ఎల్‌-1 పాయింట్‌కు చేరేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. ఈ ఎల్‌ వన్‌ పాయింట్‌ నుంచి సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయవచ్చు. ఆదిత్య ఎల్‌ -1 మొత్తం ఏడు పరిశోధనా పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలతో పాటు వెలుపల ఉండే కరోనానూ కూడా అధ్యయనం చేస్తాయి. సౌరజ్వాలలు, సౌర రేణువులు, సూర్యుడి సమీపంలో ఉండే వాతావరణం వంటి ఎన్నో అంశాలను ఆదిత్య మిషన్‌ శోధించనుంది.

ఇవి కూడా చదవండి

ఆదిత్య ఎల్1 పంపిన వీడియోలో అంతరిక్షం నుంచి భూమి, చంద్రుల దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. వీడియోలు,ఫోటోలలో భూమి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దూరంగా కనిపిస్తున్నాయి. భూమి పెద్దగా కనిపించినా చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. భారతదేశం తన మొదటి సన్ మిషన్ ఆదిత్య L1ని సెప్టెంబర్ 2న ప్రారంభించిన సంగతి తెలసిందే. ఈ ఉపగ్రహం మొదటి కక్ష్య ప్రక్రియ సెప్టెంబర్ 3న విజయవంతంగా నిర్వహించబడింది. లాగ్రాంజ్ పాయింట్ L-1 వైపు తరువాతి కక్ష్యలోకి ప్రవేశించే ముందు ‘ఆదిత్య L1’ మరో రెండు కక్ష్య విధానాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉపగ్రహం దాదాపు 127 రోజుల తర్వాత ఎల్-1 పాయింట్ వద్ద కోరుకున్న కక్ష్యను చేరుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..