
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యను చేపట్టి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు పాల్పడడంతో భారత్ మళ్లీ పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడి చేసి పాక్లోని సుమారు 11 ఎయిర్బేస్లను నాశనం చేసింది. అయితే పాక్ దాడులను భారత్ సైనికులు సమర్థవంగా ఎదుర్కొవడం, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషించారని సైనిక వర్గాలు వెళ్లడించాయి. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సుమారు 3000 మంది అగ్నివీరులు గన్నర్లు, ఆపరేటర్లు, భారీ వాహన డ్రైవర్లుగా తమ సేవల్ని అందించారని తెలిపారు. అయితే ఈ అగ్ని వీరులందరూ తాజాగా అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరిన 20 ఏళ్ల లోపు యువకులే.
పాకిస్తాన్ ప్రతీకార దాడులను తిప్పికొట్టడంతో ఈ అగ్ని వీరులు తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యంగా వీరు నాలుగు విభాగాల్లో పనిచేశారు. గన్నర్లుగా, రేడియో ఆపరేటర్లుగా, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లుగా, గన్స్-క్షిపణులు అమర్చిన వాహనాలను నడిపే డ్రైవర్లుగా అగ్ని వీరులు సత్తా చాటారు. ఇండియన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్తీర్ యాక్టివేట్ చేయడానికి, దాన్ని ఆపరేటర్ చేయడానికి కూడా అగ్ని వీరులు సహకారం అందించారు. ఒక్కో యూనిట్లో సుమారు 150-200 మంది అగ్నివీరులు పాల్గొన్నారని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అగ్ని వీరులను జమ్మూకాశ్మీర్లో విధుల్లోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఈ అగ్నివీరుల సమన్వయం, వేగవంతమైన ప్రతిస్పందన, ఆపరేషన్ సిందూర్ విజయవం కావడంలో కీలకంగా పనిచేసింది. వీరి పనితీరును సైనిక వర్గాలు సైతం ప్రశంసించాయి. క్షేత్రస్థాయి పోరాటంలో వారు పొందిన శిక్షణ, పరిస్థితులకు అనుగునంగా ప్రవర్తించే వారి నైపుణ్యం సాధారణ సైనికులకు ఏమాత్రం తీసిపోదని వారు తెలిపారు. ఈ ఆపరేష్ సిందూర్ విజయం యువత ప్రతిభను సాయుధ బలగాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన అగ్నిపథ్ పథకానికి లభించిన ఆమోదం అని వారు అభిప్రాయపడ్డారు.
2022లో ఈ అగ్నిపథ్ (Agnipath) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత యువతను భారత సాయుధ బలగాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) నాలుగు సంవత్సరాల కాలపరిమితితో “అగ్నివీర్”లుగా నియమిస్తారు. ఇందులో 6 నెలల శిక్షణ 3.5 సంవత్సరాల దేశ రక్షణలో పని చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత, 25 శాతం మంది అగ్నివీర్లను వారి పనితీరు ఆధారంగా శాశ్వత సైనిక సేవలకు ఎంపిక చేస్తారు. మిగిలినవారు “సేవా నిధి” ప్యాకేజీతో రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ తర్వాత వీరికి ఇతర ఉద్యోగాలలో (పోలీసు, భద్రతా సంస్థలు) ప్రాధాన్యత ఇస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..