
దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక సెయింట్ కొలంబా పాఠశాలకు చెందిన 16 ఏళ్ల శౌర్య పాటిల్ మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 2 పై నుండి దూకి శౌర్య మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో లభించిన అతని స్కూల్ బ్యాగ్లో ఒక సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు ముగ్గురు ఉపాధ్యాయులే కారణమని శౌర్య స్పష్టంగా రాశాడు.
ఈ అంశంపై శౌర్య తండ్రి ప్రదీప్ పాటిల్ కీలక విషయాలు వెల్లడించారు. ఆత్మహత్య జరిగిన రోజు స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా శౌర్య కిందపడిపోయాడుని.. అది చూసిన ఉపాధ్యాయులు అతన్ని లేవదీయాల్సింది పోయి.. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఎగతాళి చేశారని తండ్రి ఆరోపించారు. ‘‘అందరి ముందు అవమానిస్తూ డ్యాన్స్ నుంచి అతన్ని తొలగించారు. శౌర్య ఏడుస్తున్నా కూడా ఒక టీచర్ కనికరం లేకుండా ‘నువ్వు ఎంత కావాలంటే అంత ఏడవు.. నాకేం అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించినట్లు తండ్రి తెలిపారు. ఆ అవమానం భరించలేకే శౌర్య స్కూల్ వెనుక గేటు నుంచి బయటకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లడిల్లిపోయాడు.
గత ఏడాది కాలంగా శౌర్యను టీచర్లు టార్గెట్ చేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. “మేము దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. స్కూల్ యాజమాన్యం మా కొడుకు చదువులో వెనుకబడ్డాడని, సాకులు చెబుతున్నాడని కొట్టిపారేసేవారు. పైగా ఇంకా మాట్లాడితే టీసీ ఇచ్చి పంపిస్తామని మమ్మల్ని బెదిరించారు” అని ప్రదీప్ కన్నీరుమున్నీరయ్యారు.
శౌర్య రాసిన ఆఖరి లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ‘‘సారీ మమ్మీ.. నేను నిన్ను ఇప్పటికే చాలాసార్లు బాధపెట్టాను. ఇదే చివరిసారి. మన స్కూల్ టీచర్లు ఇలాంటివారే.. నేను ఏం చెప్పగలను..? నా చావుతోనైనా వారికి శిక్ష పడాలి. నాలాగా ఇంకే విద్యార్థి బలికాకూడదు’’ అని లేఖలో రాశాడు. చనిపోతూ కూడా శౌర్య గొప్ప మనసు చాటుకున్నాడు. తన శరీరం ముక్కలైనా సరే అందులో ఏవైనా అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే.. వాటిని అవసరం ఉన్నవారికి దానం చేయాలని లేఖలో కోరాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..