
భోపాల్, ఫిబ్రవరి 26: మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ పబ్లిక్ పరీక్ష రాసేందుకు వెళ్లింది. పరీక్ష ప్రారంభమైన కాపేపటికే విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఇన్విజిలేటర్ అనుమతి తీసుకుని వాష్రూమ్లోకి వెళ్లింది. అయితే చాలా సేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది కంగారుపడ్డారు. పైగా వాష్ రూం లోపలి నుంచి పసి బిడ్డ ఏడుపు వినిపించింది.
దీంతో కంగారు పడిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది టాయిలెట్ తలుపులు తెరిచి చూడగా షాకింగ్ దృశ్యం వారి కంట పడింది. నేలపై రక్తం మడుగులో విద్యార్థిని బిడ్డను ప్రసవించి ఉండటం చూసి హతాసులయ్యారు. వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అత్యవసర అంబులెన్స్ సర్వీస్కు సమాచారం అందించింది. తల్లీబిడ్డను హుటాహుటిన వైద్య సంరక్షణ కోసం పితంపూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ బాలికను బిడ్డతో సహా ఆసుపత్రికి తీసుకువచ్చారు. తల్లి, నవజాత శిశువు ఇద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన పరీక్ష కేంద్రంలోని విద్యార్థులు, సిబ్బందిలో భయాందోళనలకు దారితీసింది. బెట్మాలో నివాసం ఉంటున్న బాలిక పరీక్ష రాయడానికి పితంపూర్ పరీక్ష కేంద్రంకి వచ్చి మగ శిశువుకు జన్మ ఇచ్చిందని.. ఈమేరకు పితంపూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్పై పోలీసులు కేసు నమోదైందని ఇండోర్ జిల్లాలోని బెట్మా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
ధార్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) విజయ్ డాబర్ ఈ సంఘటనను ధృవీకరించారు. ఆమె ఇండోర్ పోలీస్ అధికార పరిధిలోని పట్టణానికి చెందినది కావడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బెట్మా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి పంపినట్లు తెలిపారు. విచారణలో బాధితురాలు గత రెండు సంవత్సరాలుగా ఒక యువకుడితో పరిచయం ఉందని తెలిసింది. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.