
నేటి కాలంలో యువత విహారయాత్రలను కేవలం విరామంగా చూడటం లేదు, ఒక సరికొత్త జీవన అనుభవంగా భావిస్తున్నారు. అందుకే మిలీనియల్స్, జెన్-జీ పర్యాటకులు ఇప్పుడు కమ్యూనిటీ ట్రావెల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం స్టార్ హోటళ్లలో బస చేయడం కంటే స్థానిక ప్రజలతో కలిసి ఉంటూ వారి సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరుండి చూడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ పర్యాటకులకు వియత్నాం అత్యంత ఇష్టమైన డెస్టినేషన్గా అవతరించింది. తక్కువ బడ్జెట్లో విదేశీ పర్యటన సాధ్యం కావడంతో పాటు, అక్కడి ప్రజల ఆతిథ్యం, సులభమైన వీసా నిబంధనలు యువతను భారీగా ఆకర్షిస్తున్నాయి.
వియత్నాం పర్యటనలో రాజధాని హనోయ్ నుంచి చారిత్రక హోచి మిన్ సిటీ వరకు ప్రతి నగరం ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. పర్యాటకులు ముఖ్యంగా హా లాంగ్ బే లాంటి అందమైన సముద్ర తీరాలు, ప్రాచీనమైన హోయ్ ఆన్ వీధుల్లో గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ప్రకృతి అందాలే కాకుండా అక్కడి వీధుల్లో దొరికే రకరకాల స్థానిక వంటకాలు, ముఖ్యంగా వియత్నామీస్ కాఫీ, స్ట్రీట్ ఫుడ్ రుచి చూడటం యువతకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది. గ్రూప్ ట్రావెలింగ్ లేదా సోలో ట్రిప్స్ ప్లాన్ చేసే వారికి ఈ దేశం సురక్షితమైన, సరసమైన ఎంపికగా నిలుస్తోంది.
పర్యాటక రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం యువత ఇప్పుడు లగ్జరీ కంటే లెర్నింగ్ మీద దృష్టి పెడుతున్నారు. వియత్నాంలోని పల్లెటూళ్లలో హోమ్స్టేలు ఎంచుకోవడం, స్థానిక వృత్తులను గమనించడం, వారి జీవనశైలిలో భాగం కావడం వల్ల ప్రయాణానికి ఒక అర్థం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇన్ ఫ్లూయెన్సర్ల ప్రభావం కూడా వియత్నాం క్రేజ్ పెరగడానికి ఒక ముఖ్య కారణం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కడి లొకేషన్లు చూసి ఈ వేసవిలో లేదా సెలవుల్లో వియత్నాం వెళ్లాలని ప్లాన్ చేసే భారతీయుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.