ఒత్తిడితో కూడుకున్న జీవితం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, తక్కువ నీరు తాగడం కారణం ఏదైనా ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే అనుభవించే ఆ నరకం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. అయతే కిడ్నీల్లో రాళ్ల సమస్యను శరీరం కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే తెలియజేస్తుంది. ఇంతకీ కిడ్నీల్లో రాళ్లు వస్తే కనిపించే ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పే మొదటి లక్షణం పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. పక్కటెముకలు, భుజాలు, వీపులో దిగువ భాగంలో నొప్పి వస్తే అది కిడ్నీ స్టోన్ కావొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించినప్పుడు, నొప్పి పొత్తికడుపుతో పాటు లోయర్ బ్యాక్కు వ్యాపిస్తుంది.
* మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన నొప్పి లేదా మంటను అనుభవిస్తే ఇది కూడా మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతం కావచ్చు. ఈ లక్షణం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* సాధారణం కంటే తరచుగా మూత్ర విసర్జన చేస్తే మూత్ర నాళంలోకి రాయి చేరిందని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కనిపించే మరో సాధారణ లక్షణం మూత్రంలో రక్తం ఒకటి. దీనిని హెమటూరియా అని కూడా అంటారు. రక్తం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో వస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లేనని అర్థం.
* మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన దుర్వాసన వచ్చినా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* ఇక వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించినా కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కడుపు నొప్పితో పాటు పైన తెలిపిన లక్షణాలు ఉంటే వెంటనే కిడ్నీ సంబంధిత పరీక్ష చేయించుకోవాలని చెబుతున్నారు.
* జ్వరం, చలి కూడా కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు. దీర్ఘకాలంగా జ్వరం వస్తూ పోతుంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..