
సాంకేతిక ప్రపంచంలో సౌలభ్యాలు పెరిగినట్టే, సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతం అయ్యాక, మన చుట్టూ పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా కనిపిస్తోంది. ఖాళీ సమయం దొరికితే చాలు, వేళ్లు వాటంతట అవే రీల్స్ను స్క్రోల్ చేస్తున్నాయా? కళ్లు స్క్రీన్కు అతుక్కుపోతున్నాయా? విలువైన సాహిత్యం, సంగీతం వంటివి పక్కనపెట్టి, అర్థం పర్థం లేని వీడియోలను చూస్తూ గంటల సమయం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కావడం లేదు. ఈ అలవాటు మన ఉత్సాహాన్నీ, మనశ్శాంతినీ ఎలా హరిస్తుందో ఎప్పుడైనా గమనించారా?
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతి అంశాన్నీ బుర్రలో వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చని వ్యక్తిని ఎదురుపడితే ఎలా ఇగ్నోర్ చేస్తామో, నెట్టింట కూడా అదే సూత్రాన్ని పాటించాలి. అనవసరమైన గాసిప్స్, ట్రోలింగ్ మరియు సెలిబ్రిటీల విషయాల్లో అనవసరపు వాదనలకు దిగడం వల్ల మన శక్తి వృథా కావడమే తప్ప, ఒరిగేదేమీ లేదు.
సమాచారాన్ని తెలుసుకోవడం ముఖ్యం, కానీ ఏది తెలుసుకోవాలో, దేనిని విస్మరించాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే. మనశ్శాంతి, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే, నెగెటివిటీని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. మీ సోషల్ మీడియా ఫీడ్ను మీ నియంత్రణలోకి తెచ్చుకోండి. మీ పైన ఎవరి అభిప్రాయమూ ప్రభావం చూపకుండా, సొంత ఆలోచనలతో బ్రతకడం మొదలుపెట్టండి.