
హిందూ సంప్రదాయంలోనూ, వాస్తు శాస్త్రంలోనూ ఉదయకాలపు సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం పూట మనం రోజను ఎలా ప్రారంభిస్తామనే దానిపైనే ఆ రోజంతా మన మానసిక స్థితి, విజయం ఆధారపడి ఉంటాయి. వాస్తు, జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే కొన్ని చిన్నపాటి నియమాలను పాటించడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడమే కాకుండా, ప్రతికూల శక్తులు నశించి అదృష్టం వరిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం కళ్లు తెరవగానే మొదట మన రెండు అరచేతులను కలిపి చూసుకోవాలి. మన అరచేతి ముందు భాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవి, మూల భాగంలో గోవిందుడు (బ్రహ్మ) నివసిస్తారని శాస్త్రాలు చెబుతాయి. కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ.. అనే శ్లోకాన్ని స్మరిస్తూ అరచేతులను చూసుకుని, ఆపై ముఖానికి రాసుకోవడం వల్ల రోజంతా సకల శుభాలు కలుగుతాయి. ఆ తర్వాతే భూమిపై కాలు పెట్టే ముందు భూదేవికి నమస్కరించడం అలవాటు చేసుకోవాలి.
చాలా మందికి నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ, వాస్తు ప్రకారం, ఉదయాన్నే అద్దం చూసుకోవడం చాలా పెద్ద తప్పు. రాత్రి నిద్రలో మన శరీరంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తి నిద్ర లేవగానే అద్దం ద్వారా తిరిగి మనపై ప్రభావం చూపుతుంది. అలాగే, ఉదయాన్నే ఎవరితోనూ వాదలాడటం, కోపగించుకోవడం లేదా ఇంట్లో చీకటి గదుల వైపు చూడటం చేయకూడదు. అలాగే ఎంగిలి పాత్రలను ఉదయం పూట చూడటం కూడా మంచిది కాదు.
నిద్ర లేచిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారం, కిటికీలను తెరిచి ఉంచాలి. దీనివల్ల తాజా గాలి, సూర్యరశ్మితో పాటు సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వీలైతే ఉదయాన్నే స్నానం ముగించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్య బలం పెరిగి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ఇల్లు, పూజా గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వల్ల దరిద్రం తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులను మీ ఉదయకాలపు దినచర్యలో భాగం చేసుకుంటే, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..