
పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి, పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా ప్రవర్తించే ‘రివర్స్ పేరెంటింగ్’ అనే సరికొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నారు. చైనాలోని చాలా ఇళ్లలో ఇప్పుడు దృశ్యం మారిపోయింది. పిల్లలు నేల మీద పడి ఏడుస్తుంటే, తల్లిదండ్రులు వారిని కొట్టడం లేదు సరికదా.. తాము కూడా వారి పక్కనే పడుకుని ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా, దీనినే ‘రివర్స్ పేరెంటింగ్’ అంటున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, యువ తల్లిదండ్రులు తమ పిల్లలతో వ్యవహరించే తీరులో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అధికారాన్ని చలాయించడం కంటే, బాధ్యతను నేర్పడమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం.
ఇందులో మూడు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి.
తల్లిదండ్రులు ఎప్పుడూ తామే సర్వశక్తిమంతులుగా ఉండకుండా, కొన్నిసార్లు తమ బలహీనతలను పిల్లల ముందు ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, తల నొస్తోంది అని చెబితే.. ఆ చిన్నారి తన తల్లికి నీళ్లు ఇవ్వడం లేదా ఓదార్చడం వంటివి చేస్తుంది. దీనివల్ల పిల్లల్లో సానుభూతి, బాధ్యత పెరుగుతాయి.
పిల్లలు మాట వినకుండా చలిలో సన్నటి బట్టలు వేసుకుంటామని మొండికేస్తే, వారిని వారించకుండా అలాగే వెళ్లనివ్వాలి. ఆ చలి తగిలినప్పుడు కలిగే ఇబ్బందిని వారు స్వయంగా అనుభవిస్తే, మరుసటి రోజు నుంచి వారే జాగ్రత్తగా ఉంటారు. పది మాటల కంటే ఒక అనుభవం ఎక్కువ నేర్పుతుందని ఈ పద్ధతి చెబుతోంది.
పిల్లలు చాక్లెట్ కోసం మారాం చేస్తూ నేలపై పొర్లాడితే, పేరెంట్స్ కూడా వారి పక్కనే పడుకుని అచ్చం అలాగే ప్రవర్తించాలి. తమ ప్రవర్తనను ఇతరులు అనుకరించడం చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. తమ చర్యలు ఎంత అసహ్యంగా ఉన్నాయో వారికి అర్థమై, వెంటనే ఏడుపు ఆపేస్తారు.
నేటి యువ తల్లిదండ్రులు తమ చిన్నతనంలో చాలా కఠినమైన క్రమశిక్షణలో పెరిగారు. అప్పట్లో కేవలం మాట వినడం మాత్రమే ముఖ్యం ఉండేది. కానీ, ఇప్పుడు వారు తమ పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడాలని, పరస్పర గౌరవం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అరుపులు, కేకలు లేకుండా పిల్లలకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. రివర్స్ పేరెంటింగ్ అనేది అన్ని వేళలా పనిచేసే మంత్రదండం కాదు.
దీనిని వాడేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. పిల్లలను గేలి చేస్తున్నట్లు కాకుండా, వారికి అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉండాలి. టీనేజ్ పిల్లల కంటే చిన్న పిల్లల మీద ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. పెద్ద పిల్లలతో అయితే చర్చలు, లాజిక్ ద్వారానే ఫలితాలు వస్తాయి. అధికారం భయం ద్వారా కాకుండా, అవగాహన ద్వారా రావాలని రివర్స్ పేరెంటింగ్ చెబుతోంది. పిల్లలు మన మాట వినాలంటే, ముందు మనం వారి ప్రపంచంలోకి వెళ్లాలి. ఈ సరికొత్త ట్రెండ్ మన దేశంలో కూడా మెల్లగా మొదలవుతోంది.