
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాయు కాలుష్యం ప్రధానమైంది. వాహనాల వాడకం విపరీతంగా పెరగడం, పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. భారత్లో ఈ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తాండవిస్తోంది.
పెరుగుతోన్న వాయు కాలుష్యంతో వ్యాధులు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. విపరీతంగా పెరుగుతోన్న వాయు కాలుష్యం కారణంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఫైన్ పార్టికల్ వాయు కాలుష్యం కారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.
సూక్ష్మమైన కణ వాయు కాలుష్యానికి దీర్ఘకాలంగా ఎక్స్పోజ్ కావడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఫైన్ పార్టికల్ (PM 2.5) వాయు కాలుష్యానికి గురికావడం 10 µg/m3 పెరిగినప్పుడు రొమ్ము క్యాన్సర్ ముప్పు 28% పెరిగిందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయమై లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ చార్లెస్ స్వాంటన్ మాట్లాడుతూ.. ‘పీల్చుకునే గాలి ద్వారా చిన్న కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో కణాలు రక్తంలోకి ప్రవేశిస్తున్నాయి. అనంతరం ఈ కణాలు రొమ్ముతో పాటు ఇతర కణ జాలాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. ధూమపానం అలవాటు లేని వారిలో pm2.5 కణాలు ఊపిరిత్తుల క్యాన్సర్కు ఎలా ప్రేరేపిస్తున్నాయో అధ్యయనంలో వెల్లడైంది.
ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఊపిరితిత్తుల క్యాన్సర్కు వాయు కాలుష్యంగా కారణంగా వచ్చే సూక్ష్మ కణాలు, నైట్రోజన్ డయాక్సైడ్కు మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలిక PM2.5, NO2 ఎక్స్పోజర్లు కొలొరెక్టల్, ప్రోస్టేట్ క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచాయని పరిశోధనల్లో తేలింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిన నేపథ్యంలో పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించాలన్న అంశంపై చర్చించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..