
వంటింట్లో పోపు వేసే సమయంలో నూనె చిట్లి శరీరం లేదా స్టవ్ చుట్టూ పడటం సాధారణంగా జరిగే ఇబ్బంది. ఈ సమస్యను నివారించడానికి ఒక సులువైన కిచెన్ హ్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చిన్న చిట్కా మీ వంట పనిని సురక్షితంగా, సులువుగా మారుస్తుంది. అదేంటంటే..
నూనెలో తేమ చేరినప్పుడు లేదా మనం తాలింపు కోసం వాడే కరివేపాకు, పచ్చిమిర్చి వంటి వాటిలో నీటి చుక్కలు ఉన్నప్పుడు, అధిక వేడి వద్ద నూనె, నీరు చర్య జరిపి బాణలి నుంచి బయటకు చిట్లుతాయి. దీనికి చెక్ పెట్టేందుకు సింపుల్ కిచెన్ హ్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. అది ఉప్పు లేదా పసుపు చిట్కా. అది ఎలాగంటే..
పోపు వేసే సమయంలో నూనె చిట్లకుండా ఉండటానికి ఈ చిన్న చిట్కా పాటించండి. బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత, అందులో ఆవాలు లేదా కరివేపాకు వేయడానికి ముందే ఒక చిటికెడు ఉప్పు లేదా పసుపు వేయాలి. ఉప్పు లేదా పసుపు నూనెలో వేయగానే, నూనెలో ఉన్న తేమను అవి పీల్చుకుంటాయి. ఫలితంగా నూనె వేడి సమతుల్యంగా మారి, పోపు దినుసులు వేసినప్పుడు నూనె చుక్కలు పైకి ఎగసిపడవు.
కరివేపాకు, పచ్చిమిర్చి పొడిగా ఉంచడం: తాలింపులో వేసే కరివేపాకు లేదా పచ్చిమిర్చిలను కడిగిన తర్వాత పొడి గుడ్డతో బాగా తుడిచి, తేమ లేకుండా చూసుకున్నాకే నూనెలో వేయాలి.
కడాయి తడి లేకుండా చూసుకోవడం: నూనె పోసే ముందే బాణలి లేదా మూకుడు పూర్తిగా పొడిగా ఉందో లేదో సరిచూసుకోవాలి.
సిమ్లో ఉంచి వేయడం: పోపు దినుసులు వేసే సమయంలో మంటను సిమ్లో ఉంచడం వల్ల నూనె శరీరంపై పడే ప్రమాదం తప్పుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..