
వేసవి వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు కేవలం బయట ఉష్ణోగ్రతలే కాదు, మన శరీర అంతర్గత వ్యవస్థ కూడా అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా వేసవిలో జీర్ణక్రియ నెమ్మదించడం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. దీనివల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, వికారం వంటివి వేధిస్తుంటాయి. అయితే మన వంటింట్లో దొరికే పుదీనా, కొత్తిమీర ఈ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలని సైన్స్ చెబుతోంది. మరి ఈ రెండింటిలో ఏది దేనికి పని చేస్తుంది? ఏది వాడితే మంచిది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తీవ్రమైన వేడి వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీని ప్రభావం నేరుగా జీర్ణవ్యవస్థపై పడుతుంది. ఆకలి లేకపోవడం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై భారం పెరిగి, ఆహారం త్వరగా అరగదు. ఫలితంగా కడుపు బరువుగా అనిపిస్తుంది.
జర్నల్ ఆఫ్ ఫార్మకోగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీ పరిశోధనల ప్రకారం.. పుదీనాలో ఉండే మెంథాల్ శరీరానికి తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు పేగుల్లోని వేడిని తగ్గిస్తాయి. భోజనం తర్వాత వచ్చే గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడంలో ఇది నంబర్ వన్. మీకు తరచుగా గుండెల్లో మంట, వికారం, అజీర్తి వంటి సమస్యలు ఉంటే పుదీనాను ఎంచుకోండి. పుదీనా నీరు, మజ్జిగలో పుదీనా ఆకులు లేదా పుదీనా చట్నీ రూపంలో తీసుకోవచ్చు.
ఫైటోకెమిస్ట్రీ జర్నల్ ప్రకారం.. కొత్తిమీరను తక్కువ మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్లు చురుగ్గా పనిచేస్తాయి. ఇది ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. వేసవిలో వచ్చే వాటర్ రిటెన్షన్ సమస్యను ఇది తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత కడుపు చాలా బరువుగా అనిపించినా, అసలు ఆకలి వేయకపోయినా కొత్తిమీర మీకు మేలు చేస్తుంది. కొత్తిమీర నీరు, కూరల్లో పైన చల్లుకోవడం లేదా చట్నీ రూపంలో వాడవచ్చు.
పుదీనా : ఎసిడిటీ, వికారం, గ్యాస్ సమస్యలుంటే వాడాలి.
కొత్తిమీర : కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, బరువుగా అనిపించడం వంటి సమస్యలుంటే కొత్తమీర బెస్ట్.
కచ్చితంగా.. సైన్స్ ప్రకారం ఈ రెండింటినీ సమతుల్య మోతాదులో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మీ పేగు ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుస్తాయి. అయితే, వీటిని వాడే ముందు శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు.