
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని కృప కోసం చాలామంది రోజంతా ఉపవాస దీక్ష పాటిస్తారు. కొందరు అసలు నీళ్ళు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటే, మరికొందరు పండ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం పూర్తి చేస్తారు. అయితే రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా ఉపవాస సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
ఉపవాసం ప్రారంభించే ముందు రోజు రాత్రి లేదా ఉదయాన్నే తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు, నూనెలో వేయించిన ఆహారాలు తింటే జీర్ణ సమస్యలు వచ్చి కడుపు భారంగా మారుతుంది.
ఉపవాస సమయంలో అరటిపండ్లు, ఆపిల్స్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు రోజంతా శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని నివారిస్తాయి.
సగ్గుబియ్యం: సగ్గుబియ్యంతో చేసిన కిచిడీ లేదా పాయసం తక్షణ శక్తిని ఇస్తాయి. అయితే వీటి తయారీలో నూనె, నెయ్యి వినియోగాన్ని తగ్గించడం మంచిది.
మఖానా: నెయ్యిలో దోరగా వేయించిన మఖానాలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి.
పెరుగు, మజ్జిగ: పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో చల్లదనంతో పాటు జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
ఫలహారం తీసుకుంటూ ఉపవాసం చేసేవారు రోజంతా సరిపడా నీరు తాగాలి. నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
ఉపవాసం పూర్తి చేసిన వెంటనే ఒకేసారి విందు భోజనం లేదా వేయించిన బరువైన పదార్థాలు తినకూడదు. తేలికపాటి ఫలాలు లేదా ద్రవ పదార్థాలతో ఉపవాసం విరమించి, ఆ తర్వాత క్రమంగా సాధారణ ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశయానికి మేలు జరుగుతుంది. కృష్ణాష్టమి ఉపవాసంలో ఈ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందంతో పాటు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..