
ప్రస్తుతం చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది దీనికి తాము తినే ఆహారమే కారణమని భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, అనారోగ్యకరమైన జీవనశైలి, అసమయ భోజనం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. జీర్ణవ్యవస్థ మన శరీరంలో అత్యంత కీలకమైన భాగం. ఇది ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగకపోతే గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది వీటిని సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే వాటి వెనుక ఉన్న కారణాలను గుర్తించడం అవసరం.
నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మహేష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, సమయానికి భోజనం చేయకపోవడం, రెండు పూటల మధ్య ఎక్కువ విరామం ఇవ్వడం, చాలా వేగంగా తినడం వంటి అలవాట్లు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్, అధిక మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత దెబ్బతినే “ఇంటెస్టినల్ డైస్బయోసిస్” సమస్య కూడా జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
గ్యాస్ సమస్యతో పాటు నిరంతర కడుపు నొప్పి, తీవ్రమైన కడుపు ఉబ్బరం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, తరచూ వాంతులు కావడం లేదా మలవిసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలు ఎక్కువకాలం కొనసాగి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. దీంతో అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
జీర్ణక్రియ మెరుగుపడేందుకు భోజనాన్ని సమయానికి చేయడం, ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినడం అవసరం. రోజూ తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జంక్ ఫుడ్, అధిక మసాలా ఆహారాలను తగ్గించడం కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం పాటించడం ద్వారా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.