మొక్కజొన్నలను ఆహారంగా తీసుకోవడం కామన్ విషయం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొక్క జొన్నను ఉడికించి, కాల్చి, వేయించుకుని తింటూ ఉంటారు. మరి కొందరు వీటితో టిఫిన్లుగా, స్నాక్స్ కూడా తయారు చేస్తారు. ఇలా మొక్క జొన్నతో గారెలను కూడా తయారు చేస్తారు. అయితే ఈసారి గారెలు తయారు చేసేటప్పుడు కొన్ని రకాల చిట్కాలను ట్రై చేస్తే.. ఇవి మరింత టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. తినేకొద్దీ తినాలని అనిపిస్తాయి. అదే విధంగా ఆరోగ్యం కూడా. వీటిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ మొక్క జొన్న గారెలను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొక్క జొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీల కర్ర, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, శనగ పిండి, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా, ఆయిల్.
మొక్క జొన్న గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా.. మొక్క జొన్న గింజలను శుభ్రంగా కడిగేసి.. వడకట్టి జార్ లో వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే పచ్చి మిర్చి, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, జీల కర్ర కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు, శనగ పిండి, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా వేసుకుని.. బాగా కలుపు కోవాలి.
ఈలోపు కడాయి తీసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. పల్చగా కాకుండా కాస్త మందంగా గారెలను ఒత్తుకుని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చు కోవాలి. ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని నేరుగా తిన్నా.. లేక టమాటా సాస్ తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వీటిని ట్రై చేస్తే చాలా ఇష్టపడి తింటారు.