
చేపలంటే ఇష్టపడేవాళ్ళకు చేపల ఇగురు కూర ఒక అద్భుతమైన ఎంపిక. దీని రుచి ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మామూలు చేపల కూరలా కాకుండా.. కాస్త భిన్నంగా, స్పైసీగా ఉండే ఈ ఇగురు కర్రీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చేప ముక్కల్ని కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత చేప ముక్కలను వేసి నెమ్మదిగా వేయించాలి. అవి గోధుమ రంగు వచ్చే వరకు తిప్పుతూ వేయించి తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి.
ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం చిన్న మిక్సీ జార్ లో కొద్దిగా ధనియాలు, తురిమిన అల్లం, కారం, పసుపు, ఉప్పు వేసి అందులో తగినంత నీరు పోసి బాగా రుబ్బుకోవాలి. మరో వైపు కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో నల్ల జీలకర్ర, ఎండు మిర్చి వేసి మీడియమ్ మంటపై వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకులు, ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తర్వాత ముందే కలిపిన మసాలా మిశ్రమాన్ని అందులో పోసి కొద్దిసేపు మరిగించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన చేప ముక్కలు వేసి వాటిపై తగినంత నీరు పోసి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా వేడి చేయాలి. పచ్చి మిరపకాయలను చీల్చి అందులో వేసి మూత పెట్టాలి. మంటను తగ్గించి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉడికించాలి.
ఈ విధంగా చేసినప్పుడు చేప ముక్కలు మసాలా రుచులతో బాగా నిండిపోతాయి. చిన్న ముక్కలుగా కట్ చేయకుండానే చేపను పూర్తిగా ఉడికించడమూ ఈ పద్ధతిలోనే సులభంగా చేయవచ్చు. చివరగా వేడి వేడిగా వడ్డించేసి అదిరిపోయే రుచిని పొందవచ్చు.