
మహిళలు మెనోపాజ్ దశలో శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. వేడి, అలజడి, నీరసం, భావోద్వేగ మార్పులు, ఒళ్లు నొప్పులు, మతిమరుపు వంటి సమస్యలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిపుణులు కొన్ని ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు అనేది ప్రతి భారతీయ వంటకానికి ముఖ్యమైన పదార్థం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటంతో శరీరంలో జ్వరం, వాపులను తగ్గిస్తుంది. పసుపు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో ఎదురయ్యే వేడి ఆవిర్లకు ఉపశమనం పొందవచ్చు.
గ్రీన్ టీ మన శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది కేవలం క్యాన్సర్ నుంచి రక్షించడమే కాకుండా శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెనోపాజ్ సమయంలో గ్రీన్ టీ తరచుగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయులు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, చీజ్, సోయా, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయి. అదనంగా బ్రోకోలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు వేడి ఆవిర్లను తగ్గించడంలో సహాయపడుతాయి.
మెనోపాజ్ సమయంలో ఐరన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, నట్స్ వంటి ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి. అయితే కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండడం కూడా ముఖ్యం. కారం ఎక్కువగా ఉండే ఆహారాలు, కెఫీన్, చక్కెర, పిండి పదార్థాలు, ఉప్పులను మితంగా తీసుకోవడం అవసరం. బదులుగా రోజుకు ఎక్కువగా నీరు తాగడం మంచిది.
వారానికి కనీసం కొన్ని రోజులు వ్యాయామం చేయడం ద్వారా మెనోపాజ్ లక్షణాలను అధిగమించవచ్చు. వ్యాయామం కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా మెనోపాజ్ దశను ఆరోగ్యంగా, సులభంగా దాటేయవచ్చు. మీరు కూడా మీ జీవన శైలిలో ఈ మార్పులను పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)