చికెన్తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
ఈ రోజుల్లో రెస్టారెంట్ కి వెళ్తే చికెన్ కబాబ్తో పాటు ఫిష్ ఫ్రై ఆర్డర్ చేయడం చాలా కామన్గా మారిపోయింది. అయితే కోడి మాంసంతో పాటు చేపలను కలిపి తింటే అది శరీరంలో విషంగా మారుతుందా? లేక ఇదంతా ఒక మూఢనమ్మకమా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చికెన్ బిర్యానీతో పాటు ఫిష్ ఫ్రై తింటున్నప్పుడు, లేదా రెస్టారెంట్కి వెళ్లినప్పుడు చికెన్ కబాబ్తో పాటు ప్రాన్ మసాలా ఆర్డర్ చేసినప్పుడు చాలా మంది మనసులో ఒకటే డౌట్ కొడుతుంది.. అసలు చికెన్తో పాటు చేపలు తినవచ్చా?. ఇలా తింటే బాడీకి పడదా? స్కిన్ అలర్జీలు వస్తాయా? అని కొందరు భయపడితే.. రెండూ ప్రోటీన్లే కదా, తింటే తప్పేంటి? అని మరికొందరు లాగించేస్తారు. మరి ఈ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఇది కేవలం మూఢనమ్మకమా లేక శాస్త్రీయ వాస్తవమా? అనేది తెలుసుకుందాం..
ఆయుర్వేదం ఏమంటోంది?
మన సాంప్రదాయ ఆయుర్వేద గ్రంథాల ప్రకారం.. చికెన్, చేపలను కలిపి తినడాన్ని విరుద్ధ ఆహారం అని పిలుస్తారు. కోడి మాంసం స్వభావ రీత్యా వేడిగా ఉంటుంది. అలాగే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. చేపలు కూడా వేడి చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ త్వరగా జీర్ణమవుతాయి. ఈ రెండింటి జీర్ణ ప్రక్రియలు వేరువేరుగా ఉండటం వల్ల.. వీటిని ఒకేసారి తిన్నప్పుడు మన పొట్టలోని జీర్ణశక్తి గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది.
సైన్స్ ఏం చెబుతోంది?
పోషకాహార నిపుణులు, ఆధునిక విజ్ఞానశాస్త్రం మాత్రం దీనికి భిన్నమైన క్లారిటీ ఇస్తున్నాయి. చికెన్తో పాటు చేపలు తినడం వల్ల బాడీలో విషం తయారవుతుందని లేదా ప్రాణాంతకం అవుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. చికెన్లో హై-క్వాలిటీ ప్రోటీన్, బి-విటమిన్లు, ఫాస్ఫరస్ ఉంటాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-డి, అయోడిన్ ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి రకరకాల అమైనో ఆమ్లాలు అంది కండరాల పుష్టికి సహాయపడుతుంది. సమస్య కాంబినేషన్లో లేదు మనం తినే క్వాంటిటీ, క్వాలిటీలోనే ఉంది.
అసలు సమస్య ఎప్పుడు వస్తుంది?
అతిగా తింటే అంతే సంగతి: ఒకే భోజనంలో 300 గ్రాముల కంటే ఎక్కువ జంతు ప్రోటీన్ తీసుకుంటే జీర్ణవ్యవస్థపై విపరీతమైన లోడ్ పడుతుంది. దీనివల్ల కడుపు భారంగా మారడం, వికారం, గ్యాస్ వస్తాయి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు: ఆల్రెడీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, కిడ్నీ సమస్యలు, గౌట్ ఉన్న రోగులు ఈ రెండు రకాల మాంసాలను ఒకేసారి తింటే నొప్పులు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
క్రాస్ – కంటామినేషన్ : చికెన్ను 75 డిగ్రీల వద్ద, చేపలను 63 డిగ్రీల టెంపరేచర్ వద్ద వండాలి. ఒకే నూనెలో రెండింటినీ మార్చి మార్చి వేపినా లేదా ఒకే చాపింగ్ బోర్డ్ వాడినా బ్యాక్టీరియా ఒకదానికొకటి వ్యాపించి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది.
సేఫ్గా తినాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి
మితంగా తినండి: చికెన్, చేపలు రెండూ కలిపి తింటున్నప్పుడు టోటల్ క్వాంటిటీ 150 నుండి 200 గ్రాములకు మించకుండా చూసుకోండి.
ఫైబర్ జోడించండి: ఈ హెవీ నాన్-వెజ్ భోజనంతో పాటు పీచుపదార్థం ఉండే సలాడ్, ఆకుకూరలు, నిమ్మరసం లేదా మజ్జిగను చేర్చుకుంటే అరుగుదల ఈజీ అవుతుంది.
వేర్వేరుగా కడగండి: వండే ముందు చికెన్, చేపలను వేర్వేరు పాత్రల్లో, వేర్వేరు కత్తులు ఉపయోగించి క్లీన్ చేయాలి. తాజా మాంసాన్ని మాత్రమే వాడాలి.
రైట్ టైమ్: భోజనం ముగిశాక కాస్త గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు.
ఎవరెవరు దూరంగా ఉండాలి?
ఆయుర్వేద నియమాలను గట్టిగా నమ్మేవాళ్లు, తరచుగా అజీర్ణం, ఎసిడిటీ లేదా ఐబీఎస్ లాంటి కడుపు సమస్యలతో బాధపడేవాళ్లు ఈ కాంబినేషన్కు దూరంగా ఉండటమే బెస్ట్. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, అలర్జీల హిస్టరీ ఉన్నవారు ఒకే పూట ఈ రెండూ తినకపోవడం మంచిది.
కోడి మాంసంతో పాటు చేపలు తినడం పాపమూ కాదు, అలాగని విషపూరితమూ కాదు.. అది పూర్తిగా మీ శరీర జీర్ణశక్తి, మీరు తినే పరిమాణం, వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆయుర్వేదం హెచ్చరిస్తుంటే.. విజ్ఞానశాస్త్రం పర్మిషన్ ఇస్తోంది. మీ కడుపు స్ట్రాంగ్గా ఉండి, లిమిట్గా తింటే నో ప్రాబ్లం.
