
భారతీయుల భోజనంలో పెరుగు లేనిదే ముద్ద దిగదు. జీర్ణక్రియకు, ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి పెరుగు ఒక దివ్యౌషధం. అయితే, పెరుగు తినడం గురించి మనలో చాలామందికి కొన్ని భయాలు, సందేహాలు ఉన్నాయి. రాత్రి పూట తినకూడదని కొందరు, జలుబు చేస్తుందని మరికొందరు అంటుంటారు. ఈ అపోహలపై మహారాష్ట్రకు చెందిన హోమియోపతి నిపుణుడు సాయాజీరావు గైక్వాడ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
చాలామంది పెరుగు తింటే జలుబు చేస్తుందని భయపడతారు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్ గైక్వాడ్ స్పష్టం చేశారు. పెరుగు తిన్న తర్వాత ఎవరికైనా అసౌకర్యంగా అనిపిస్తే, అది వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుందే తప్ప అందరికీ వర్తించదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుకు దూరంగా ఉండక్కర్లేదు. తియ్యని పెరుగులో గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. పెరుగు శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. భోజనంతో పాటు తక్కువ మొత్తంలో పెరుగు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.
రాత్రి పూట పెరుగు అస్సలు తినకూడదనే కఠినమైన నియమం ఏమీ లేదు. మంచి జీర్ణశక్తి ఉన్నవారు రాత్రి భోజనంలో పెరుగును నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు. అయితే మరీ భారీగా ఉండే ఆహారాలు లేదా వేయించిన వంటకాలతో కలిపి తీసుకుంటే కొందరికి అసౌకర్యం కలగవచ్చు.
మార్కెట్లో దొరికే అన్ని ప్యాక్డ్ పెరుగుల్లో ప్రోబయోటిక్స్ ఉండవు. మీరు ప్యాక్డ్ పెరుగు కొనేటప్పుడు దాని లేబుల్ మీద ప్రోబయోటిక్ అని ఉందో లేదో కచ్చితంగా తనిఖీ చేయాలి. వీలైనంత వరకు ఇంట్లో తోడు పెట్టుకున్న తాజా పెరుగు వాడటమే శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.