ఇనుము అంత బలం.. ఆ సమస్యలుంటే ఇట్టే మాయం.. ఆంధ్రా లడ్డు స్పెషాలిటీ ఇదే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ తీపి వంటకం మినప సున్నుండలు. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ లడ్డూలు శరీరానికి బలం, పోషకాలు అందిస్తాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండటంతో పిల్లల ఎదుగుదలకు, పెద్దల్లో ఎముకల బలానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

మినప సున్నుండలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సాంప్రదాయక, బలమైన, రుచికరమైన తీపి వంటకం.. మినప సున్నండల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది పిల్లల పెరుగుదలకు ఒక అద్భుతమైన ఆహారంగా, పెద్దలకు ఎముకలను బలపరిచే చిరుతిండిగా ఉపయోగపడుతుంది. ఇది సులభంగా జీర్ణమవ్వడంతోపాటు.. అన్ని వయసుల వారికి బలాన్ని రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే.. మినప్పప్పును ఉపయోగించి సున్నుండలను సులభంగా తయారు చేసుకోవచ్చు.. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ సున్నుండలు శరీరానికి ఎంతో శక్తిని, పోషకాలను అందిస్తాయి. ఇందులో వాడే నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అలాగే.. బెల్లం శరీరానికి సహజమైన తీపిని, బలాన్ని ఇస్తుంది. చక్కెర బదులుగా బెల్లం వాడటం ఆరోగ్యానికి మరింత మంచిది.
మినప సున్నుండలు తయారు చేసుకోవడం ఎలానో తెలుసుకోండి..
కావలసిన పదార్థాలు:
- మినప గుళ్ళు: సరిపోయేంత
- బెల్లం- మినప్పప్పు క్వాంటిటికీ సగానికి పైగా..
- యాలకులు
- పుట్నాల పప్పు: మినపప్పు క్వాంటిటికి పావువంతు..
- నెయ్యి: సరిపోయేంతగా..
తయారీ విధానం:
ముందుగా, ఒక మందపాటి పాన్ తీసుకుని అందులో మినప గుళ్ళను వేయాలి. వీటిని తక్కువ మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. మినప గుళ్ళు బంగారు రంగులోకి మారి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. వేయించేటప్పుడు నూనె వాడకూడదు, కేవలం పొడిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేయించడం వల్ల అవి క్రిస్పీగా తయారవుతాయి. పదిహేను నిమిషాల తర్వాత మినప గుళ్ళు చక్కగా వేగిన తర్వాత, స్టవ్ ఆపి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన మినప గుళ్ళను ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. వీటితో పాటు యాలకులు, పుట్నాల పప్పును కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి.
తర్వాత, తురిమిన బెల్లాన్ని మిక్సీ జార్ లో వేసి, కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి. (పూర్తిగా పొడి కాకపోయినా పర్వాలేదు, పిండితో కలిపినప్పుడు మెత్తబడుతుంది.) ఇప్పుడు, బెల్లం పొడిని మినప పిండి గిన్నెలో వేసి రెండింటినీ బాగా కలిసేలా చేతులతో కలపాలి. బెల్లం – మినప పిండి మిశ్రమం పూర్తిగా కలిసిపోయేలా చూసుకోవాలి.
సున్నుండలు చుట్టడానికి, నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకోవాలి. మినప పిండి మిశ్రమానికి కొద్దికొద్దిగా కరిగిన నెయ్యిని కలుపుతూ ఉండలు చుట్టాలి. పిండి గట్టిగా పట్టుకున్నప్పుడు ఉండగా మారేంత నెయ్యి వేయాలి. చిన్న చిన్న ఉండలుగా చుట్టి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఈ సున్నుండలు గట్టిగా, చక్కటి ఆకారంలో వచ్చే వరకు నెయ్యిని తగినంత కలుపుతూ ఉండాలి.
ఈ విధంగా తయారు చేసిన మినప సున్నుండలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకుంటే నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇవి పండుగలకు, ప్రయాణాలకు లేదా సాధారణ సమయాలలో బలమైన స్నాక్ గా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
చిన్న సీక్రెట్ మేడమ్.. ఇదొక్కటి చేస్తే.. మల్లెలు గుత్తులు గుత్తులుగా పూస్తాయ్..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
