
ఆరోగ్యకరమైన శరీరానికి నీరు చాలా అవసరం. మనం ప్రతిరోజూ నీటితోనే మన రోజును ప్రారంభించాలి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే మూత్రపిండాలు, కాలేయం కూడా సరిగ్గా పనిచేస్తాయి. జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నీరు తాగడం వల్ల శక్తి పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ప్రతిరోజూ పరగడుపున నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలో డాక్టర్ ప్రభాత్ రంజన్ సిన్హా గారి నుండి తెలుసుకుందాం.
శరీరంలోని రక్తాని శుద్ధి చేసి, విషతుల్యాలను (Toxins) మూత్రం రూపంలో బయటకు పంపే అద్భుతమైన యంత్రాలు కిడ్నీలు. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలంటే శరీరానికి తగినంత నీరు అందాలి. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతుంటారు. కానీ, కిడ్నీల రక్షణ కోసం నీటి వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఎంత నీరు అవసరం?:
సాధారణంగా ఒక వయోజనుడు రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీరు (సుమారు 3 లీటర్లు) తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు తగినంతగా తాగడం వల్ల కిడ్నీలలో ఖనిజాలు పేరుకుపోకుండా ఉంటుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది.
తక్కువ నీరు త్రాగితే వచ్చే సమస్యలు: శరీరంలో నీటి శాతం తగ్గితే (Dehydration), కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవణాలు గడ్డకట్టి రాళ్లుగా మారుతాయి. మూత్రనాళంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీర్ఘకాలం పాటు తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ పనితీరు మందగిస్తుంది.
మీరు సరిగ్గా నీరు తాగుతున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?:
మీ మూత్రం రంగు మీ ఆరోగ్యానికి సూచిక అంటున్నారు నిపుణులు. ఎలాగంటే మూత్రం రంగు పారదర్శకం/లేత పసుపు రంగులో ఉంటే, మీరు హైడ్రేటెడ్గా ఉన్నారు. అదే ముదురు పసుపు/గోధుమ రంగులో ఉంటే, మీ శరీరానికి వెంటనే నీరు అవసరమని అర్థం.
నీరు తాగడం అంటే కేవలం సాదా నీరు మాత్రమే కాదు. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ రూపంలో కూడా ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు నీటి పరిమాణం విషయంలో తమ డాక్టరును సంప్రదించడం తప్పనిసరి. గుర్తుంచుకోండి, నీరే కిడ్నీలకు ఉత్తమమైన మందు!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..