
ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివని చాలామంది భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖ్యంగా షాపుల్లో కొనే ప్యాకేజ్డ్ జ్యూస్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. ఈ ప్యాకేజ్డ్ జ్యూస్లలో అధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అంతేకాకుండా వాటిలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని శీతల పానీయాల మాదిరిగానే హానికరం అని చెబుతున్నారు.
పండ్ల రసంలో సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, వాటిని రసంగా మార్చే ప్రక్రియలో ఫైబర్ కోల్పోతాయి. ఫైబర్ లేకపోవడం వల్ల చక్కెర శరీరం ద్వారా త్వరగా శోషించబడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.
మితంగా తీసుకోవాలి: ఇంట్లో చక్కెర కలపకుండా తయారు చేసుకున్న రసాలను కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
పండ్లను నేరుగా తినడం మేలు: పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా తినడం మంచిది. ఎందుకంటే పండ్లలో ఉండే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
ప్యాకేజ్డ్ జ్యూస్లు మానుకోండి: బయట దొరికే ప్యాకేజ్డ్ జ్యూస్లు లేదా పానీయాలను పూర్తిగా నివారించడం ఉత్తమం. ఎందుకంటే వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే, పండ్ల రసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.