Bahubali Paratha: ఆనంద్ మహీంద్రా మనసు దోచిన బాహుబలి వంటకం.. దీని ముందు పిజ్జా కూడా పనికిరాదట!

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు భారతీయ ఆహారం అంటే ఎంత ఇష్టమో తెలిపే ఓ పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. భారీ 'బాహుబలి పరాఠా' తయారీని చూపిస్తూ, "ఇది ఉన్నప్పుడు పిజ్జా ఎందుకు?" అని ఆయన ప్రశంసించారు. ఈ పరాఠాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో, దాని రుచి, పోషక విలువల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Bahubali Paratha: ఆనంద్ మహీంద్రా మనసు దోచిన బాహుబలి వంటకం.. దీని ముందు పిజ్జా కూడా పనికిరాదట!
Anand Mahindra Viral Video

Updated on: May 07, 2026 | 5:41 PM

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తనను ఆకట్టుకున్న ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను, స్ఫూర్తిదాయక కథనాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, మన దేశీ ఆహారం, చిరు వ్యాపారుల ప్రతిభ పట్ల ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది. ఇతరులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన గతంలో పంచుకున్న ఒక పాత వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒక భారీ పరాఠాను చూపిస్తూ, “మనకు పరాఠా దొరుకుతున్నప్పుడు, ఇక పిజ్జాతో పనేముంది?” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఆ వీడియోలో ఏముంది?
ఆనంద్ మహీంద్రా డిసెంబర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి భారీ ‘బాహుబలి స్టఫ్డ్ పరాఠా’ను తయారు చేయడం కనిపిస్తుంది. ముందుగా ఒక పెద్ద గోధుమ పిండి ముద్దను తీసుకుని, దానిని చపాతీలా వెడల్పుగా చేస్తాడు. ఆ తర్వాత దాని నిండా రుచికరమైన ఆలూ మసాలా కూరను ఉంచి, అంచులను మూసేసి మళ్ళీ కొద్దిగా పిండి చల్లి పెద్ద పరాఠాలా ఒత్తుతాడు. దాన్ని చాలా జాగ్రత్తగా ఎత్తి ఒక పెద్ద పెనం (తవా) మీద వేసి, రెండు వైపులా నూనె లేదా నెయ్యితో ఎర్రగా కాలుస్తాడు. బాగా కాలిన తర్వాత దాన్ని అచ్చం పిజ్జాలాగా ముక్కలుగా కోసి, పక్కన పెరుగు, ఊరగాయ, పుదీనా చట్నీతో నోరూరించేలా వడ్డిస్తాడు.

తయారీ విధానం:
ఈ భారీ పరాఠాను చూసి మురిసిపోవడమే కాదు, మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే వీడియోలో ఉన్నంత పెద్దగా కాకుండా, మీ ఇంట్లో ఉండే పెనం సైజుకు తగ్గట్టుగా పరాఠా పరిమాణాన్ని ఎంచుకోండి.

ముందుగా గోధుమ పిండిని కొంచెం ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి.

లోపల స్టఫింగ్ కోసం ఉడికించిన బంగాళదుంపలు (ఆలూ), సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా వంటివి వేసి కూర సిద్ధం చేసుకోవాలి.

పిండి ముద్దను తీసుకుని కొంచెం వెడల్పు చేసి, ఈ మసాలాను లోపల పెట్టి మూసేయాలి.

ఇప్పుడు నెమ్మదిగా పరాఠాలా చుట్టుకుని, వేడిగా ఉన్న పెనం మీద కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి రెండు వైపులా కరకరలాడేలా కాల్చుకోవాలి.

దీనిని వేడివేడిగా పెరుగు లేదా చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

 

పరాఠాలో ఎన్ని రకాలో..
సాధారణ పరాఠాలను కేవలం పిండితో త్రిభుజాకారంలో లేదా గుండ్రంగా చేసి నెయ్యితో కాలుస్తారు. కానీ స్టఫ్డ్ పరాఠాలు చాలా ప్రత్యేకం. ఆలూ పరాఠా, గోబీ (క్యాబేజీ) పరాఠా, పనీర్ పరాఠా, ముల్లంగి పరాఠా, సత్తు పరాఠా.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరాఠాలను రకరకాలుగా తింటారు. పంజాబ్‌లో పరాఠాలను లస్సీతో కలిపి లాగిస్తే, బీహార్‌లో సత్తు పరాఠాను ఊరగాయ, పెరుగుతో ఆస్వాదిస్తారు. ప్రస్తుతం ప్రతి వీధిలోనూ, రెస్టారెంట్లలోనూ ఇవి విరివిగా లభిస్తున్నాయి.

పరాఠా ఎప్పుడు తినాలి? లాభాలేంటి?
పరాఠా అనేది రోజులో ఎప్పుడైనా తినదగిన ఒక సంపూర్ణమైన వంటకం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, మధ్యాహ్నం భోజనంగా కానీ, రాత్రి డిన్నర్‌గా కానీ తీసుకోవచ్చు. పిల్లలకు స్కూల్ లంచ్ బాక్సులో ప్యాక్ చేయడానికి, రైలు ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి ఇది అద్భుతమైన ఎంపిక. ఒకటి లేదా రెండు పరాఠాలు తింటే చాలు, కడుపు నిండిపోతుంది. తక్కువ నూనె లేదా నెయ్యితో దీన్ని తయారు చేసుకుంటే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. లోపల పెట్టే కూరను బట్టి పోషక విలువలు పెరుగుతాయి. అందుకే జంక్ ఫుడ్ అయిన పిజ్జాలు, బర్గర్ల కంటే మన దేశీ పరాఠానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Follow Us