కొద్ధి మంది ఎమ్మెల్యేలను, అది కూడా ‘కుళ్ళిన స్థితిలో’ ఉన్నవారిని మీరు కొనగలుగుతారని, కానీ తృణమూల్ కాంగ్రెస్ ను కొనజాలరని బెంగాల్ సీఎం, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆమె ఇలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. సరిగ్గా వారం రోజుల క్రితమే అమిత్ షా ఈ రాష్ట్రానికి వచ్చి..బోల్ పూర్ లో జరిగిన రోడ్ షో, భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా టీ ఎం సీ ని, మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శించారు. కాగా-మంగళవారం మమత ఇదే బోల్ పూర్ లో జరిగిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు. తమ పార్టీకి చెందిన మాజీ నేత సువెందు అధికారి సహా సుమారు 10 మంది నేతలు ఇటీవల బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావిస్తూ.. ఇలా మా వాళ్ళను కొన్నంత మాత్రాన మా పార్టీకి వఛ్చిన నష్టం ఏమీ లేదన్నారు. బీజేపీని బయటి పార్టీగా అభివర్ణిస్తూ..మీరు ఫేక్ పాలిటిక్స్, హేట్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని, కానీ మీ పప్పులుడకవని వ్యాఖ్యానించారు. బెంగాల్ వెన్నును చీల్చడానికి మీరు యత్నిస్తున్నారు..కానీ రవీంద్ర నాథ్ ఠాగూర్ ‘సోనార్ బంగ్లా’ గా పేర్కొన్న ఈ రాష్టంలో మీ ఆటలు సాగబోవు అని మమత అన్నారు.