వీరేందర్ గౌడ్ కాషాయ తీర్థం వెనుక కహానీ అదే..!!
సార్వత్రిక ఎన్నికల తర్వాత దూకుడు పెంచిన బిజెపి అధినాయకత్వం.. మనుగడ అంతంత మాత్రం వున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా పార్టీల నేతలకు గాలమేసేందుకు బిజెపి అధినాయకత్వం ఆదేశాల మేరకు పలువురు వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా కొనసాగుతున్న ఆపరేషన్ లో టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలకు కాషాయదళం గాలమేస్తూనే వుంది. ఈ క్రమంలో గురువారం అత్యంత కీలక పరిణామం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన […]
సార్వత్రిక ఎన్నికల తర్వాత దూకుడు పెంచిన బిజెపి అధినాయకత్వం.. మనుగడ అంతంత మాత్రం వున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా పార్టీల నేతలకు గాలమేసేందుకు బిజెపి అధినాయకత్వం ఆదేశాల మేరకు పలువురు వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా కొనసాగుతున్న ఆపరేషన్ లో టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలకు కాషాయదళం గాలమేస్తూనే వుంది. ఈ క్రమంలో గురువారం అత్యంత కీలక పరిణామం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన పలువురు టిడిపి, కాంగ్రెస్ పార్టీల నేతలు బిజెపిలో చేరారు. రామ్ మాధవ్ సమక్షంలో జరిగిన ఈ చేరికల్లో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా ఒకరు.
వీరేందర్ గౌడ్ ఇటీవల టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అధికార పార్టీలో చేరతారా లేక మరే ఇతర పార్టీవైపు మొగ్గు చూపుతారా అన్న అంశంపై చర్చ జరిగింది. చివరికి ఆయన బిజెపి వైపే మొగ్గు చూపారు. వీరేందర్ గౌడ్ నిర్ణయం వెనుక కారణమేంటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోందిపుడు. రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్ఎస్ ను, అధికారం చేపట్టే సత్తా వున్న కాంగ్రెస్ పార్టీని కాదని.. బిజపిలో వీరేందర్ గౌడ్ చేరడమేంటన్న సందేహాలు మొదలయ్యాయి. కానీ..వీరేందర్ గౌడ్ నిర్ణయం వెనుక బలమైన కారణాలే వున్నట్లు తాజా సమాచారం. తొలి నుంచి టిడిపిలో కొనసాగిన వీరేందర్ గౌడ్ కుటుంబం.. 2008 నుంచి వివిధ పార్టీలలోకి మారుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జోరుగా కొనసాగుతున్న తరుణంలో టిడిపిలో తెలంగాణ వాదానికి తగిన గుర్తింపు లేదంటూ.. నవ తెలంగాణ పార్టీని స్థాపించారు వీరేందర్ గౌడ్ తండ్రి, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్. టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయలేక చతికిల పడిన దేవేందర్ గౌడ్ తాను స్థాపించిన నవ తెలంగాణ పార్టీని.. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం బొక్కబొర్లా పడడంతో దేవేందర్ గౌడ్ తిరిగి సొంత గూడైన టిడిపిలో చేరారు. తాను టిడిపిని వీడడం చారిత్రక తప్పిదమని ఘాటువ్యాఖ్యలు కూడా చేశారు దేవేందర్ గౌడ్. అప్పట్నించి టిడిపిలోనే వున్న దేవేందర్ గౌడ్ ను రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన సీనియారిటీని గౌరవించారు టిడిపి అధినేత చంద్రబాబు. అయితే.. రాష్ట్ర విడిపోయిన తర్వాత తెలంగాణలో టిడిపికి మనుగడ కస్టమవడం.. ఆ పార్టీకి చెందిన నాయకుల్లో 90 శాతం ఇతర పార్టీల్లో చేరిపోవడంతో దేవేందర్ గౌడ్ ఫ్యామిలీకి రాజకీయ మనుగడ కష్టమైపోయింది. దాంతో తన సంగతెలా వున్నా.. తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం క్రూషియల్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టిఆర్ఎస్.. రెండింటి నుంచి పిలుపులు వస్తున్నా.. వీరేందర్ గౌడ్ వ్యూహాత్మకంగా బిజెపి వైపు మొగ్గుచూపారు. కారణమేంటంటే.. ఆ రెండు పార్టీల్లో తాను ఆశించే స్థానాలకు విపరీతమైన పోటీ వుండడం.. దానికి తోడు బిజెపి హవా నగర ప్రాంతాల్లో పెరుగుతుండడం.. ఈ రెండు అంశాలపై సమాలోచనలు జరిపిన తర్వాత వీరేందర్ గౌడ్ బిజెపిలో చేరేందుకే మొగ్గు చూపారని సమాచారం.