హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్నగర్లో ఉత్తమ్ పద్మావతి ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యారంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ హుజూర్నగర్లో ఉత్తమ్ పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని అన్నారు. గతంలో సైన్యంలో పనిచేసిన ఉత్తమ్.. చాలా ధైర్యవంతుడని.. ఇప్పుడాయనకు ప్రత్యేకంగా ధైర్యం చెప్పాల్సిన పనిలేదన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు.. పార్టీలో ఉన్న విభేదాలను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యుద్ద విమానంలో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి ఉత్తమ్ అంటూ కొనియాడారు. హుజూర్నగర్లో ఓడిపోయినంత మాత్రాన ఉత్తమ్కు వచ్చిన నష్టం ఏం లేదని.. ఆయన పార్టీ పదవి ఎక్కడికి పోదన్నారు. ఉపఎన్నికలు ఎక్కడ జరిగిన.. ఫలితాలు అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతాయని.. గతంలో టీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా అధికార పార్టీలే లబ్ది పొందాయని గుర్తుచేశారు. ఉపఎన్నికలు ఎప్పుడు కూడా ఏ పార్టీకి రెఫరెండం కాదని స్పష్టం చేశారు.