ప‌శ్చిమ‌బెంగాల్‌పై గురిపెట్టిన క‌మ‌ల‌ద‌ళం.. జనవరి 30 నుంచి అమిత్‌ షా రెండ్రోజుల పర్యటన

|

Jan 09, 2021 | 8:53 PM

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా వ్యూహ రచన చేస్తున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌పై గురిపెట్టిన క‌మ‌ల‌ద‌ళం.. జనవరి 30 నుంచి అమిత్‌ షా రెండ్రోజుల పర్యటన
Follow us on

త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా వ్యూహ రచన చేస్తున్నారు. బీజేపీ పట్ల ప్రజల్లో మరింత సానుకూలతను రాబట్టేందుకు నిరంతరం కృషి చేయడానికి సమాయత్తమవుతున్నారు. తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ బెంగాళీలకు దగ్గరవ్వాలని భావిస్తున్నారు. ఇక నుంచి నెలలో ఒక వారం చొప్పున ఆ రాష్ట్రంలో ఆయన పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జనవరి 30 నుంచి రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తన పర్యటనలో భాగంగా నార్త్ 24 పరగణాల జిల్లాలో మతువా కమ్యూనిటీ బలంగా ఉన్న ఠాకూర్‌నగర్‌ లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు బెంగాల్ ఫ్లాన్ చేసింది. ఈ ర్యాలీలో అమిత్‌షా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మతువా కమ్యూనిటీ బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉంది. 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఉంటుందని పార్టీ విశ్లేషకులు చెబుతున్నారు. మతువా కమ్యూనిటీ నేత, బీజేపీ ఎంపీ సంతను ఠాకూర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా ఈ విధంగా ఎన్నికలకు ముందు పర్యటించడం వల్ల మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.