తాగి వచ్చి వేధిస్తున్న తల్లిని చంపిన మైనర్లు

|

Sep 17, 2020 | 8:48 PM

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు కన్నతల్లిని కడతేర్చారు. నిత్యం తాగి వచ్చి వేధింపులకు పాల్పడుతున్న తల్లిని ఇద్దరు మైనర్లు పాశవికంగా హత్య చేసి, బాత్‌రూంలో పడేశారు.

తాగి వచ్చి వేధిస్తున్న తల్లిని చంపిన మైనర్లు
Follow us on

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు కన్నతల్లిని కడతేర్చారు. నిత్యం తాగి వచ్చి వేధింపులకు పాల్పడుతున్న తల్లిని ఇద్దరు మైనర్లు పాశవికంగా హత్య చేసి, బాత్‌రూంలో పడేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ అక్కడి సుందర్‌పాద ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు మైనర్‌ కుమారులతో కలిసి నివాసముంటోంది. ప్రతి రోజు ఆమె మద్యం సేవించే అలవాటు ఉంది. అయితే నిత్యం తాగివచ్చి తన ఇద్దరు పిల్లలను హింసించేది. ఆమె టార్చర్ భరించలేకపోయరు పిల్లలు. ఈ నేపథ్యంలో తల్లిపై పగ పెంచుకున్నారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన ఆమె.. వారిపై అరవటం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు పాలిథిన్‌ కవరుతో తల్లి ముఖాన్ని కప్పేసి, రాడ్డుతో తలపై బలంగా కొట్టారు. దీంతో ఊపిరాడని స్థితిలో కుప్పకూలిపోయింది.. తలకు బలమైన గాయం కారణంగా తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా, తల్లి చనిపోయిందని నిర్థారించుకున్న మైనర్లు ఆమె శవాన్ని బాత్‌రూంలో పడేసి, పెంపుడు కుక్కను తీసుకుని అపార్ట్‌మెంట్‌ గార్డు దగ్గరకు పరిగెత్తారు. తమ ఇంట్లోకి కొందరు దుండగులు చొరబడి తల్లిని కొట్టి చంపారని అతడితో చెప్పారు. గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.​ అనంతరం పోలీసుల విచారణలో ఆ ఇద్దరు మైనర్లు తల్లిని తామే చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.