
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో రద్దు చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇక, భక్తులు ముందుగా దర్శన టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నవారికి శ్రీవారిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2020 సెప్టెంబరు నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈమేరకు టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భక్తులకు శ్రీనివాసుడి దర్శనాన్ని కూడా నిలిపివేశారు. ఇక, కరోనా కాస్త కుదుటపడుతుండడంతో తిరిగి పూర్తి సేవలు కొనసాగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆన్లైన్ టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు. టిక్కెట్లు తీసుకున్న భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు టీటీడీ అధికారులు చెప్పారు.