హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దుబ్బాక గెలుస్తామని కలలు కంటున్నాడని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసత్యాలు, అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజుర్నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదని జగదీశ్ రెడ్డి అన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయని తెలిపారు. సైదిరెడ్డి గెలిచిన రెండు రోజులకే సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చి కోట్ల రూపాయాల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు.. సంవత్సరం తిరగకుండానే అభివృద్ధి పనులకు జీవోలు జారీ చేసి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో 3 వేల మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి 1500 ఓట్లు తెచ్చుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ ఓట్లు పడటం కూడా కష్టమేనని జగదీశ్ జోస్యం చెప్పారు.