అధికారంలో లేనప్పుడు ఒకలా.. అధికారం చేపట్టగానే మరోలా.. ఇదీ ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం. ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లో ఉన్న ఉండవల్లిలో గత టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యక్రమాలకు అనువుగా ఉండేలా నిర్మించుకున్న ప్రజావేదిక ప్రస్తుతం వార్తలకెక్కింది. ప్రభుత్వం మారింది కాబట్టి ఖాళీ చేయాలని అధికార వైసీపీ, పార్టీ కార్యక్రమాలకోసం తమకే కేటాయించాలని టీడీపీ. ఇలా ఎవరికి వారు ప్రజావేదికను సొంతం చేసుకునేందుకు పంతాలకు పోతున్నారు. ఇంతకీ ఇది ఎవరికి చెందుతుంది?
ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదికపై గత టీడీపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు తమపార్టీ నేతలు, అధికారులు,కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ వేదికను ఉపయోగించేవారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఈ వేదికను తమ పార్టీ అవసరాలకు ఇవ్వాల్సిందింగా ఆయనే స్వయంగా వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. పైగా శుక్రావారం ఉన్నట్టుండి సీఆర్ డీఏ అధికారులను అక్కడికి పంపింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజావేదిక వద్దకు వెళ్లిన అధికారులు దాన్ని ఖాళీ చేయాలని టీడీపీ నేతలకు చెప్పారు. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేసే ప్రసక్తే లేదని అధికారులకు చెప్పి పంపించేసారు.
రాష్ట్ర ప్రభుత్వానికి దేన్నయినా స్వాధీనం చేసుకోడానికి అన్ని అర్హతలు, అధికారాలు ఉంటాయి. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమంగా కనిపించిన నిర్మాణం.. తీరా అధికారాన్ని చేపట్టిన తర్వాత సక్రమంగా మారడం వివాదాస్పదంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబు కూడా కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా లింగమనేని గెస్ట్ హౌస్ ను ముఖ్యమంత్రి నివాసంగా మార్చుకోవడం, ఆపక్కనే ప్రజావేదికను నిర్మించుకోవడం కూడా ఈ కోవకే చెందుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.