అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదాస్పద కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కూడా తమ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవాలని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణమని తెలిసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ జేఏ ఫారుకిపై ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. వివాదాస్పద అంశం నుంచి ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించినట్లు మధ్యవర్తి ప్యానెల్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను అక్రమంగా అమ్మేశారని ఫారుకిపై యూపీ ప్రభుత్వం విచారణకు ప్రతిపాదించింది. అయితే తనకు ప్రాణహాని ఉందని ఫారుకి కోర్టును కోరడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది. టైటిల్ సూట్ నుంచి కేసును ఉపసంహరించాలని నిర్ణయించామని, అయోధ్యలో ఉన్న 22 మసీదుల మెయింటేనెన్స్ చూసుకోవాలని వక్ఫ్ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. అయోధ్య కేసులో విచారణను సుప్రీం నేటితో ముగించనున్నది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును వాదించేందుకు 40 రోజుల టైంను ఫిక్స్ చేసింది.