
సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. కరోనా నేపథ్యంలో స్పీకర్ సన్నాహాలు వేగవంతం చేశారు. భద్రత, సామాజిక దూరం పాటించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్ సెక్యూరిటీ, సీపీడబ్ల్యూడీ, ఎన్డీఎంసీ, ఉభయసభల సెక్రెటరీ జనరల్స్, పార్లమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి సభ్యులను, సిబ్బందిని రక్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, మార్గదర్శకాలపై చర్చించారు. ప్రవేశ ద్వారాల వద్ద, పార్లమెంట్ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పీకర్ ఓం బిర్లా పలు సూచనలు చేశారు.
మరోవైపు, కొవిడ్ నేపథ్యంలో పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలకు రెండు ఛాంబర్లతో పాటు, గ్యాలరీని కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. 60 మంది ఎంపీలు ఛాంబర్లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్సభ హాల్లో కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు లోక్సభలోనూ ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుసరించాల్సి వ్యుహంపై స్పీకర్ పార్లమెంట్ అధికారులు సూచనలు చేశారు.