Rajini Makkal Mandram: సౌతిండియా ఫిల్మ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడుతున్నారన్న ఆనందం ఆయన అభిమానులకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వస్తున్నానని చెప్పిన నెల రోజుల్లోనే మొత్తం తారుమారైంది. తాను రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీ ప్రకటించారు. రజనీ చేసిన ఈ సంచలన ప్రకటన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో తలైవా నీ..వా అని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. నేను రాను.. రాలేను.. క్షమించండి అని రజినీ ప్రకటన చేసినప్పటి నుంచీ కూడా అభిమానులు మండిపడుతునే ఉన్నారు. ఎక్కడోక్కడ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
తలైవా పార్టీ ప్రకటిస్తే చాలు..మిగిలింది మేం చూసుకుంటాం అని భరోసా ఇస్తున్నారు. ఇవాళ చెన్నైలో రజిని అభిమానులు మరో అడుగు ముందుకేశారు. రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదనే నిర్ణయాన్ని తప్పుపట్టిన అభిమానులు.. రజినీ వెంటనే రాజకీయ పార్టీ పెట్టాలని, ఎన్నికలకు వెళ్లాలని ఆందోళనకు దిగారు. రజినీ మక్కళ్ మండ్రమ్ తరపున ఎవరూ ఆందోళనలో పాల్గొనకూడదని, అలా చేస్తే మండ్రమ్ తరపున కఠిన చర్యలు తప్పవని రజనీ ఫ్యాన్స్ అధ్యక్షులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తున్నారు. మండ్రమ్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా చెన్నైలోని వళ్లువరకూటం దగ్గర పెద్దఎత్తున ధర్నాకి దిగారు అభిమానులు.